Supreme Court: అయోధ్య కేసును రాజకీయం చేయొద్దు.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు!

Supreme Court: అయోధ్య రామాలయం విరాళాల చోరీ కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును రాజకీయం చేయొద్దని పిటిషనర్లకు హితవు పలికింది.

Arun Chilukuri
Published on: 20 July 2026 5:07 PM IST
Supreme Court
X

Supreme Court: అయోధ్య కేసును రాజకీయం చేయొద్దు.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు!

Supreme Court: అయోధ్య శ్రీరామ మందిరంలో విరాళాల చోరీ వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సున్నితమైన అంశాన్ని రాజకీయం చేయవద్దని పిటిషనర్లకు గట్టిగా హితవు పలికింది. కోర్టులు రాజకీయాలకు వేదికలు కావని ధర్మాసనం స్పష్టం చేస్తూ.. ఇది కేవలం ఒక నేరానికి సంబంధించిన అంశం మాత్రమేనని, దీనిపై నిష్పాక్షికంగా, సరైన దర్యాప్తు జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్‌ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుపై సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారా? అని సీజేఐ ప్రశ్నించగా.. యూపీ ప్రభుత్వం ఇప్పటికే 'సిట్'ను ఏర్పాటు చేసిందని, రాష్ట్ర పోలీసులు దీనిపై ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారని తుషార్ మెహతా న్యాయస్థానానికి వివరించారు. దర్యాప్తు పురోగతి వివరాలను తదుపరి విచారణ నాటికి కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ, సుప్రీం కోర్టు ఈ కేసు విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.

మరోవైపు ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ వేగవంతం చేసింది. విరాళాల లెక్కింపు సమయంలో తీవ్ర పర్యవేక్షణ లోపాలు ఉన్నట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. ఈ లోపాల ఆధారంగా ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో, నైతిక బాధ్యత వహిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి పదవికి చంపత్‌ రాయ్ రాజీనామా చేశారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

రామాలయ విరాళాల నిధులకు సంబంధించిన అంశం కావడంతో ఈ కేసుపై రాజకీయంగానూ దుమారం రేగుతోంది. ఈ లూటీ వ్యవహారంపై కేవలం రాష్ట్ర స్థాయి సిట్ దర్యాప్తు సరిపోదని, దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) తో పాటు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) తో సమగ్ర విచారణ మరియు ఆడిటింగ్ జరిపించాలని ప్రతిపక్షాలు, పలు స్వచ్ఛంద సంస్థల నుండి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story