Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర ట్రస్ట్‌లో కలకలం.. ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామా!

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర విరాళాల నిధుల దుర్వినియోగం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 26 Jun 2026 2:34 PM IST
Ayodhya Ram Mandir
X

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర ట్రస్ట్‌లో కలకలం.. ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామా!

Ayodhya Ram Mandir: అయోధ్య శ్రీరామ మందిర విరాళాల నిధుల దుర్వినియోగం వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసులో గురువారం చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో, శ్రీరామ జన్మభూమి తీర్త్‌ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ స్కామ్ కేసులో తన పర్సనల్ డ్రైవర్‌ అరెస్టయిన నేపథ్యంలో, నైతిక బాధ్యత వహిస్తూ తాను ట్రస్టు బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. చంపత్ రాయ్‌తో పాటు ట్రస్టుకు చెందిన మరో కీలక సభ్యుడు అనిల్‌ మిశ్రా కూడా తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.

అయోధ్య రామాలయానికి అందిన కోట్ల రూపాయల విరాళాలపై గత కొన్ని రోజులుగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడొకరు ఇచ్చిన అధికారిక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఈ నిధుల గోల్‌మాల్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) గత రెండ్రోజుల క్రితమే తన ప్రాథమిక నివేదికను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది.

సిట్ నివేదిక ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు.. ట్రస్ట్‌ జనరల్‌ సెక్రటరీ చంపత్‌రాయ్‌ సొంత డ్రైవర్‌తో సహా మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. దీంతో అయోధ్య పరిసరాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

అయోధ్య మందిరంలో కానుకలు, నిధుల దుర్వినియోగంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ అత్యంత సీరియస్‌గా స్పందించారు. ఈ ఉదంతంలో పాలు పంచుకున్న వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. "అయోధ్య మందిరంలో జరిగిన ఈ ఘటనపై భక్తులెవరూ చింతించకండి. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిని చట్టం విడిచిపెట్టదు. ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలకు, సనాతన ధర్మ విశ్వాసానికి సంబంధించిన విషయం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడంలో మా ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తుంది" అని సీఎం యోగి హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలపై కూడా ఆయన మండిపడ్డారు. గతంలో రామమందిర నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారే, ఇప్పుడు నిధుల దుర్వినియోగంపై కావాలనే రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం యోగి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story