Ganga River Flood : గంగనది ఉగ్రరూపం.. బీహార్లో బిగ్ అలర్ట్..
Ganga River Flood : బీహార్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు పొరుగున ఉన్న నేపాల్ నుంచి వస్తున్న వరద నీటితో నదులు మహోగ్రరూపం దాల్చాయి.
bihar floods ganga river
Ganga River Flood : బీహార్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు పొరుగున ఉన్న నేపాల్ నుంచి వస్తున్న వరద నీటితో నదులు మహోగ్రరూపం దాల్చాయి. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో దాదాపు 10.26 లక్షల మంది ప్రజలు ఈ వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యారు. రాజధాని పాట్నాలోని గాంధీ ఘాట్ వద్ద గంగానది శనివారం ఉదయం ఆల్టైమ్ రికార్డు మట్టాన్ని దాటి ప్రవహిస్తుండటంతో అధికార యంత్రాంగం తీవ్ర దిగ్భ్రాంతి చెందింది.
రికార్డు స్థాయి దాటిన గంగానది ఉధృతి
పాట్నాలోని గాంధీ ఘాట్ వద్ద గంగానది నీటిమట్టం కేవలం నాలుగు గంటల్లోనే 10 సెంటీమీటర్లు పెరిగి, ఉదయం 10 గంటలకు 50.53 మీటర్లకు చేరుకుంది. ఇది గతంలో నమోదు చేసిన అత్యధిక వరద మట్టం (50.52 మీటర్లు - ఆగస్టు 21, 2016) కంటే ఒక సెంటీమీటర్ ఎక్కువ. రాబోయే 24 గంటల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ , జలవనరుల శాఖ హెచ్చరించింది. అలాగే పండారక్ ప్రాంతంలో కూడా గంగానది గత రికార్డులను తిరగరాస్తూ ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
11 జిల్లాలు.. 201 గ్రామాలు నీటమునక
రాష్ట్ర వ్యాప్తంగా 50 బ్లాకులు, 201 గ్రామీణ పంచాయతీలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. పాట్నా, భోజ్పూర్, సరన్, వైశాలి, భాగల్పూర్, బెగుసరాయ్, బక్సర్, సమస్తిపూర్, ముంగేర్, కటిహార్ , అరారియా జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గండక్, కోసి, బుర్హి గండక్, పున్పున్, ఘాగ్రా నదులు ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో ఇప్పటివరకు సాధారణం కంటే 69 శాతం అదనంగా వర్షపాతం నమోదు కావడమే ఈ తీవ్ర పరిస్థితులకు కారణం.
రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్.. నిరంతర పర్యవేక్షణలో సీఎం
వరద తీవ్రత దృష్ట్యా ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి మంత్రులు, ఉన్నతాధికారులను నేరుగా వరద ప్రాంతాల్లోనే క్యాంప్ చేసి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. పాట్నా మున్సిపల్ కార్పొరేషన్, జలవనరుల శాఖలను హై అలర్ట్లో ఉంచారు. బాధితుల కోసం 38 కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. ఇప్పటివరకు 12,300 కంటే ఎక్కువ పాలిథిన్ షీట్లు, 2,250 పొడి రేషన్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. సహాయక చర్యల కోసం 858 పడవలను ఉపయోగించడమే కాకుండా, 27 ఎస్డీఆర్ఎఫ్ (SDRF), 7 ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలను మోహరించారు.
కేంద్రం సహాయం.. హెచ్చరిక జారీ
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ వరద పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని బిజెపి నాయకులు తెలిపారు. నది ఒడ్డున ఉన్న కట్టల వెంట ప్రత్యేక బృందాలతో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులు పోలీసు , రెవెన్యూ శాఖలను ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.




