Dharmendra Pradhan: సీబీఎస్ఈ 12వ తరగతి 'OSM' వివాదం.. పూర్తి బాధ్యత నాదేనన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్!
Dharmendra Pradhan: సీబీఎస్ఈ 12వ తరగతి ఆన్స్క్రీన్ మార్కింగ్ (OSM) వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు.
Dharmendra Pradhan: సీబీఎస్ఈ 12వ తరగతి 'OSM' వివాదం.. పూర్తి బాధ్యత నాదేనన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్!
Dharmendra Pradhan: సీబీఎస్ఈ (CBSE) 12వ తరగతి బోర్డు పరీక్షల మూల్యాంకనంలో ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్స్క్రీన్ మార్కింగ్ (OSM) పద్ధతి దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీసింది. డిజిటల్ మూల్యాంకనం పేరిట తీసుకొచ్చిన ఈ విధానం వల్ల తమ జవాబు పత్రాలు తారుమారయ్యాయని, మార్కులు భారీగా తగ్గిపోయాయని పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రంగంలోకి దిగారు. గురువారం ఢిల్లీలోని సీబీఎస్ఈ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ వివాదంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అత్యంత బాధ్యతాయుతంగా స్పందించారు. "ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతిలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఆన్స్క్రీన్ మార్కింగ్ (OSM) ప్రక్రియలో కొన్ని లోపాలు జరిగినట్లు మా దృష్టికి వచ్చింది. ఈ వైఫల్యాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నాను. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే ప్రసక్తే లేదు. విచారణలో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినట్లు తేలితే.. బాధ్యులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు" అని మంత్రి కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
విద్యార్థుల నుంచి వస్తున్న ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రీ-ఎవల్యూషన్, వెరిఫికేషన్ పోర్టల్లో తలెత్తుతున్న సర్వర్ లోపాలను సరిచేయడానికి ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్కు చెందిన సాంకేతిక నిపుణుల బృందాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు.
రీ-చెకింగ్ ఫీజుల చెల్లింపుల్లో జరుగుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఆర్థిక శాఖతో మాట్లాడి నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులను (SBI, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా) ఈ వ్యవస్థతో అనుసంధానించినట్లు పేర్కొన్నారు.
ఈ ఏడాది దాదాపు 17 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన 40 కోట్ల పేజీలను డిజిటల్గా స్కాన్ చేసి ఈ ప్రక్రియ చేపట్టామని, ఎక్కడ పొరపాట్లు జరిగాయో వాటన్నింటినీ సరిచేసి, విద్యార్థులందరికీ పూర్తి న్యాయం చేస్తామని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భరోసా ఇచ్చారు.




