Delhi Bomb Threat : ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఇమెయిల్తో కలకలం.!
Delhi Bomb Threat : దేశ రాజధాని ఢిల్లీలోని పలు కీలక ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు బాంబు బెదిరింపులకు
bomb threat
Delhi Bomb Threat : దేశ రాజధాని ఢిల్లీలోని పలు కీలక ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు బాంబు బెదిరింపులకు పాల్పడటం తీవ్ర సంచలనం సృష్టించింది. మంగళవారం ఉదయం ఢిల్లీ శాసనసభ (Delhi Assembly), ప్రముఖ సర్దార్ పటేల్ విద్యాలయ (SPV) పాఠశాల సహా పలు ప్రభుత్వ కార్యాలయాలకు ఇమెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు వెంటనే రంగంలోకి దిగి ఆయా ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి.
రంగంలోకి బాంబు స్క్వాడ్లు.. విస్తృత తనిఖీలు
ఇమెయిల్ బెదిరింపుల సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు, బాంబు నిర్వీర్య దళాలు (BDDS), డాగ్ స్క్వాడ్లు , అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యగా ఆయా ప్రాంగణాలను తమ ఆధీనంలోకి తీసుకుని చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయించారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ప్రకారం సదరు భవనాల్లో అణువణువునా తనిఖీలు నిర్వహించారు. అయితే, ఇప్పటివరకు నిర్వహించిన సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదా పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు స్పష్టం చేశారు.
ఇమెయిల్ మూలాలపై దర్యాప్తు
ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు నిర్ధారించినప్పటికీ, ముందస్తు జాగ్రత్తగా ఆయా ప్రాంతాల్లో నిఘాను కొనసాగిస్తున్నారు. ఈ బెదిరింపు ఇమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనుక ఉన్న ముఠా ఎవరు అనే కోణంలో ఢిల్లీ పోలీసులకు చెందిన సైబర్ క్రైమ్ విభాగం లోతైన దర్యాప్తు ప్రారంభించింది. గతంలో కూడా ఢిల్లీ అసెంబ్లీకి ఇలాంటి బెదిరింపు లేఖలు రావడం వల్ల అధికారులు ఈ అంశాన్ని ఎంతో తీవ్రంగా పరిగణిస్తున్నారు.
వరుస బెదిరింపులతో ఆందోళన
ఢిల్లీలో ఇలాంటి బాంబు బెదిరింపులు రావడం ఇది మొదటిసారి కాదు. ఇటీవల ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు కూడా ఢిల్లీ హైకోర్టుతో పాటు పలు జిల్లా కోర్టులను పేల్చివేస్తామంటూ ఆకతాయిలు బెదిరింపు ఇమెయిళ్లు పంపారు. అంతేకాకుండా జామ్నగర్ హౌస్, జండేవాలన్ భవనం, సాకేత్ ఆఫీస్, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI Airport) టెర్మినల్-3 , ఢిల్లీ కాంట్ SDM ఆఫీసులకు కూడా ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులు రావడం కలకలం రేపింది. వరుసగా కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ బెదిరింపులతో రాజధానిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.




