Delhi: ఢిల్లీలో దారుణం.. కదులుతున్న బస్సులో మహిళపై గ్యాంగ్ రేప్!
Delhi: ఢిల్లీలో కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది.
Delhi: ఢిల్లీలో దారుణం.. కదులుతున్న బస్సులో మహిళపై గ్యాంగ్ రేప్!
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నాంగ్లోయ్ ప్రాంతంలో కదులుతున్న ప్రైవేట్ బస్సులో ఒక మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు, నేరానికి ఉపయోగించిన స్లీపర్ బస్సును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. పితంపుర మురికివాడకు చెందిన బాధితురాలు (వివాహిత, ముగ్గురు పిల్లల తల్లి) మంగోల్పురిలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. మే 11న రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో, సరస్వతి విహార్ వద్ద ఆగి ఉన్న ఒక స్లీపర్ బస్సు వద్ద ఉన్న వ్యక్తిని ఆమె సమయం అడిగారు. వెంటనే ఆ వ్యక్తి, మరో వ్యక్తి కలిసి ఆమెను బలవంతంగా బస్సులోకి లాగారు.
బస్సును రాణి బాగ్ నుంచి నాంగ్లోయ్ వైపు నడుపుకుంటూ వెళ్తూ, కదులుతున్న వాహనంలోనే ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మెడికల్ పరీక్షలు నిర్వహించి, రాణి బాగ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఢిల్లీలో మహిళలు, చిన్నారులపై వరుసగా జరుగుతున్న దాడులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇదే మే 9న జనక్పురిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో మూడేళ్ల చిన్నారిపై 57 ఏళ్ల సిబ్బంది అత్యాచారం చేసిన ఘటన మరువకముందే ఈ సామూహిక అత్యాచారం జరగడం గమనార్హం.
ఈ రెండు కేసుల్లోనూ నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నాంగ్లోయ్ ఘటనపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.




