Delhi Violence : ఢిల్లీలో హింస.. 118 మందికి పైగా పోలీసులకు గాయాలు, 70 మంది అరెస్ట్

Delhi Violence : ఢిల్లీలో CJP చేపట్టిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారి 118 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. 70 మందిని అదుపులోకి తీసుకోగా, గాయపడిన పోలీసులను సీపీ పరామర్శించారు.

CR Reddy
Published on: 21 July 2026 6:51 AM IST
Delhi Violence
X

Delhi Violence

Delhi Violence : దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ(CJP) చేపట్టిన సంసద్ ఛలో నిరసన ప్రదర్శన ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. సోమవారం న్యూఢిల్లీ ప్రాంతంలో జరిగిన ఈ ఘర్షణల్లో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో సహా 118 మందికి పైగా పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఢిల్లీ సీపీ (కమిషనర్ ఆఫ్ పోలీస్) అనురాగ్ కుమార్, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను స్వయంగా పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

నిరసనకారుల రాళ్లదాడి.. పోలీసులకు తీవ్ర గాయాలు

పోలీసు వర్గాలు వెల్లడించిన కథనం ప్రకారం.. న్యూఢిల్లీ పరిధిలో విధిస్తున్న నిషేధాజ్ఞలను ధిక్కరిస్తూ నిరసనకారులు ఉద్రేకపూరితంగా ప్రవర్తించారు. హెచ్చరికలు చేసినప్పటికీ వెనక్కి తగ్గకుండా పోలీసులపై రాళ్లు, ఇతర వస్తువులతో దాడులకు దిగారు. రక్షణగా ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేయడమే కాకుండా, పోలీసు వాహనాలను తగలబెట్టి, ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ దాడిలో స్పెషల్ కమిషనర్, జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లతో పాటు పలువురు మహిళా పోలీసులు కూడా గాయపడ్డారు.

60 మంది నిరసనకారులకు గాయాలు

పోలీసులతో జరిగిన తోపులాటలో దాదాపు 60 మంది నిరసనకారులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. హింసకు పాల్పడటమే కాకుండా 15 నుంచి 20 ప్రభుత్వ వాహనాలను, ప్రజారోగ్య ఆస్తులను నిరసనకారులు భారీగా ధ్వంసం చేశారని అధికారులు వెల్లడించారు. ఈ ఘర్షణలకు సంబంధించి ఇప్పటివరకు సుమారు 70 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సీపీ పరామర్శ.. కఠిన చర్యలకు ఆదేశాలు

గాయపడిన పోలీసుల ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ నేరుగా ఆసుపత్రికి వెళ్లారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి శాంతిభద్రతలను కాపాడిన అధికారుల ధైర్యాన్ని ఆయన కొనియాడారు. హింసకు దిగిన వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS), ఇతర చట్టాల కింద కఠిన కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story