Kalita Majhi: నాడు ఇళ్లల్లో పనిమనిషి.. నేడు అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే..!
Kalita Majhi: ఒకప్పుడు పనిమనిషిగా నెలకు రూ. 2,500 సంపాదించిన కలితా మాఝీ, నేడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీజేపీ తరఫున పోటీ చేసి టీఎంసీ అభ్యర్థిపై గెలుపొందిన ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణం మీకోసం.
Kalita Majhi: నాడు ఇళ్లల్లో పనిమనిషి.. నేడు అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే..!
Kalita Majhi: రాజకీయాల్లో గెలవాలంటే ఆస్తులు, అంతస్తులు ఉండాలనే అపోహను పశ్చిమ బెంగాల్కు చెందిన కలితా మాఝీ (Kalita Majhi) చెరిపివేశారు. సామాన్యులు సైతం సంకల్పం ఉంటే చట్టసభల్లో అడుగుపెట్టగలరని ఆమె నిరూపించారు. తాజాగా వెలువడిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో ఔస్గ్రామ్ నియోజకవర్గం నుండి భాజపా (BJP) తరఫున పోటీ చేసిన కలితా మాఝీ అద్భుత విజయాన్ని అందుకున్నారు.
కలితా మాఝీ తన సమీప ప్రత్యర్థి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యర్థిపై 12,535 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. గుస్కారా మున్సిపాలిటీకి చెందిన ఆమె, రాజకీయాల్లోకి రాకముందు పలు ఇళ్లల్లో పనిమనిషిగా జీవనం సాగించేవారు. నెలకు కేవలం రూ. 2,500 ఆదాయంతో కుటుంబాన్ని పోషించిన ఆమె, నేడు ప్రజల ప్రతినిధిగా అసెంబ్లీకి వెళ్లబోతున్నారు.
2021 ఎన్నికల్లోనూ భాజపా కలితాకు అవకాశం ఇచ్చింది. ఆ సమయంలో టీఎంసీ అభ్యర్థి అభేదానంద థాండర్ చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలపై పోరాడారు. ఆమె నిబద్ధతను గుర్తించిన పార్టీ నాయకత్వం 2026 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసే ఛాన్స్ ఇచ్చింది. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, సామాన్య ప్రజల మద్దతుతో ఈసారి విజయం సాధించారు.
ఏమాత్రం ఆర్థిక బలం లేని మాఝీకి ఆమె మంచితనం, సామాజిక స్పృహే శ్రీరామరక్షగా నిలిచాయి. సంపద లేకపోయినా సంకల్ప బలం ఉంటే విజయం వరిస్తుందని ఆమె నిరూపించిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కలితా మాఝీ విజయం బెంగాల్ రాజకీయాల్లో ఒక గొప్ప సానుకూల మార్పుకు సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.




