Gujarat: గుజరాత్‌లో ఉగ్రకుట్ర భగ్నం.. జైషే మహమ్మద్ ముఠాకు చెందిన ఐదుగురు అరెస్ట్!

Gujarat: గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) పెద్ద ఉగ్రకుట్రను భగ్నం చేసింది.

Arun Chilukuri
Published on: 17 July 2026 12:34 PM IST
Gujarat
X

Gujarat: గుజరాత్‌లో ఉగ్రకుట్ర భగ్నం.. జైషే మహమ్మద్ ముఠాకు చెందిన ఐదుగురు అరెస్ట్!

Gujarat: దేశంలో ఉగ్రవాద అణచివేత చర్యల్లో భాగంగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సరిహద్దు అవతల నుంచి సాగుతున్న ఒక పెద్ద ఉగ్రకుట్రను భగ్నం చేసింది. పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిషేధిత జైషే మహమ్మద్ (JeM) ఉగ్ర సంస్థకు చెందిన ఒక కీలక టెర్రర్ మాడ్యూల్‌ను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ ముఠాతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్న ఐదుగురు అనుమానితులను ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు.

పక్కా సమాచారంతో గుజరాత్ పోలీసులు జరిపిన ఈ ఆపరేషన్‌లో దొరికిన నిందితులను బిలాల్ అబిద్ షేరా, మహమ్మద్ అయూబ్‌ కడివాల్‌, మహమ్మద్‌ షఫీ ముఖి, మహమ్మద్‌ హసన్‌ కరాడియా, మహమ్మద్‌ సునాసరలుగా అధికారులు గుర్తించారు. వీరిని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టగా.. కోర్టు వీరికి జులై 24 వరకు పోలీసు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇటీవల కాలంలో గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఏటీఎస్ మరియు నిఘా వర్గాలు సంయుక్తంగా దాడులు జరిపి ఎనిమిది మంది జైషే అనుమానితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. భారతదేశంలో ఒక పెద్ద ఉగ్ర నెట్‌వర్క్‌ను నిర్మించి, వినాశకర కార్యకలాపాలకు పాల్పడేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు అప్పట్లోనే నిఘా వర్గాలకు సమాచారం అందింది.

ఆ ఎనిమిది మంది అనుమానితులను విచారిస్తున్న క్రమంలోనే, పాకిస్థాన్ హ్యాండ్లర్లతో నిరంతరం టచ్‌లో ఉంటూ స్థానికంగా వారికి సహకరిస్తున్న ఈ ఐదుగురు నిందితుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరి పోలీసు కస్టడీ ముగిసేలోగా మరిన్ని కీలక లీకులు బయటకు వచ్చే అవకాశం ఉందని, దేశవ్యాప్తంగా వీరి నెట్‌వర్క్ ఎక్కడెక్కడ విస్తరించి ఉందనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story