Assembly Elections 2026 : నేడే తమిళనాడు, బెంగాల్ అసెంబ్లీ పోరు.. ద్రావిడ గడ్డపై విజయ్ మ్యాజిక్ పనిచేస్తుందా?
Assembly Elections 2026 : తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు ప్రారంభమైంది. వేల కోట్ల నగదు స్వాధీనం, భారీ భద్రత నడుమ ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
Assembly Elections 2026
Assembly Elections 2026 : భారత రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం నేడు (గురువారం, ఏప్రిల్ 23, 2026) కీలక దశకు చేరుకుంది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుండగా, బెంగాల్లో మొదటి విడత కింద 152 స్థానాలకు ఓటింగ్ నిర్వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు.
తమిళనాడులో ముక్కోణపు పోరు
తమిళనాడు రాజకీయాలు ఈసారి సరికొత్త రంగు పులుముకున్నాయి. ఎప్పుడూ డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK) మధ్యే సాగే పోరులోకి ఈసారి ప్రముఖ సినీ నటుడు దళపతి విజయ్ తన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీతో ఎంట్రీ ఇచ్చారు. అధికార డీఎంకే తన కూటమి బలంతో అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంటే, పీఠాన్ని దక్కించుకోవాలని అన్నాడీఎంకే-బీజేపీ పట్టుదలతో ఉన్నాయి. సుమారు 6.2 కోట్ల మంది ఓటర్లు 4,023 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.4 లక్షల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అటు సినీ గ్లామర్, ఇటు ద్రావిడ సెంటిమెంట్ల మధ్య తమిళ ఓటరు ఎటు మొగ్గు చూపుతారో అన్నది ఉత్కంఠగా మారింది.
బెంగాల్లో మొదటి విడత
పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 స్థానాలకు గాను నేడు 152 సీట్లకు తొలి దశ పోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర బెంగాల్లోని జిల్లాలు బీజేపీకి కీలకం. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఈసారి కూడా ఇక్కడి 54 స్థానాల్లో పట్టు సాధిస్తేనే అధికారానికి చేరువ కావచ్చని కమలం పార్టీ భావిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ (TMC) తన సంక్షేమ పథకాలు, స్థానిక సెంటిమెంట్ను నమ్ముకుంది. ఈ ఎన్నికల్లో అవినీతి కంటే పౌరసత్వం, ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు వంటి అంశాలే ప్రధాన ప్రచారాంశాలుగా మారడం విశేషం. సుమారు 3.6 కోట్ల మంది ఓటర్ల కోసం 8 వేల సమస్యాత్మక కేంద్రాల్లో రికార్డు స్థాయిలో 2,450 కంపెనీల బలగాలను మోహరించారు.
రికార్డు స్థాయిలో నగదు స్వాధీనం
ఈ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 26 నుంచి ఇప్పటివరకు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.1,072.13 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్ర*గ్స్, ఇతర కానుకలను ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంది. ఎన్నికల చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో సొత్తు పట్టుబడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పార్టీలు ఏ స్థాయిలో ప్రయత్నిస్తున్నాయో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నిఘా పెంచేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లు, నిరంతర తనిఖీలను ఈసీ ముమ్మరం చేసింది.
రంగంలో హేమాహేమీలు
తొలి దశలోనే బెంగాల్ రాజకీయాలను శాసించే ప్రముఖులు బరిలో ఉన్నారు. గతంలో సీఎం మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి ఈసారి కూడా నందిగ్రామ్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి బహరంపూర్ నుంచి, మాజీ కేంద్ర మంత్రి నిశిత్ ప్రామాణిక్ మాతాభంగ నుంచి పోటీలో ఉన్నారు. తమిళనాడులోనూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పళనిస్వామి, పన్నీర్ సెల్వం వంటి అగ్రనేతల నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు కేవలం రాష్ట్రాలకే పరిమితం కాకుండా 2026 జాతీయ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.




