CJP Parliament March: దిల్లీలో లాఠీఛార్జ్.. సీజేపీ ‘చలో పార్లమెంట్’ ఉద్రిక్తం!
CJP Parliament March: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన 'చలో పార్లమెంట్' ఉద్రిక్తంగా మారింది.
CJP Parliament March: దిల్లీలో లాఠీఛార్జ్.. సీజేపీ ‘చలో పార్లమెంట్’ ఉద్రిక్తం!
CJP Parliament March: దేశ రాజధాని దిల్లీలో సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యా వ్యవస్థలో తక్షణమే సంస్కరణలు తీసుకురావాలని, వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండు చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పిలుపునిచ్చిన 'చలో పార్లమెంట్' ర్యాలీ హింసాత్మకంగా మారింది.
జంతర్మంతర్ నుంచి పార్లమెంట్ భవనం వైపునకు సీజేపీ శ్రేణులు భారీ ర్యాలీగా బయల్దేరాయి. అయితే ఈ మార్చ్కు పోలీసుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేదు. అనుమతి నిరాకరించినప్పటికీ నిరసనకారులు బారికేడ్లను దాటుకుని ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు భద్రతా బలగాలు ప్రయత్నించగా, ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు.
కాక్రోచ్ జనతా పార్టీ 'చలో పార్లమెంట్' పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందుగానే దిల్లీవ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశ రాజధానిని హైఅలర్ట్లో ఉంచారు. జంతర్మంతర్ మినహా మిగతా ప్రదేశాలలో జనాలు భారీగా గుమిగూడటాన్ని పూర్తిగా నిషేధించారు. ఎక్కడా కూడా ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అయినప్పటికీ నిరసనకారులు భారీగా తరలిరావడంతో దిల్లీ వీధులు రణరంగంగా మారాయి.




