Income Tax Day 2026: ఆదాయపు పన్ను చరిత్ర... స్వాతంత్య్ర పోరాటం నుంచే మొదలు
భారత దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ చట్టం భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం నుండే అమలౌతూ వస్తున్నది. ఆ సంగ్రామంలో నష్టాన్ని పూడ్చుకునేందుకు బ్రిటీషర్లు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.
Income Tax Day 2026: భారతదేశంలో ఆదాయపు పన్ను చరిత్ర కేవలం బడ్జెట్ అంకెలకే పరిమితం కాదు. దీని మూలాలు 1857 నాటి మొదటి స్వాతంత్య్ర సంగ్రామం, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. 1857 తిరుగుబాటు వల్ల బ్రిటిష్ ప్రభుత్వానికి ఏర్పడిన భారీ నష్టాలను పూడ్చుకోవడానికి 1860 జూలై 24న సర్ జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ, నేడు ఆధునిక భారత్లో దేశాభివృద్ధికి మూలస్తంభంగా మారింది. 167 సంవత్సరాల క్రితం ఈ విధానం మొదలు కాగా...ఇప్పుడు దేశం ఆర్థికంగా పుంజుకోవడానికి దోహదపడిందని చెప్పవచ్చు.
ఈస్ట్ ఇండియా కంపెనీ నష్టాల నుండి డిజిటల్ విప్లవం వరకు
బ్రిటిష్ కాలంలో ప్రారంభమైన ఈ పన్నుల ప్రయాణం గడిచిన 166 ఏళ్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు 2010లో ఆదాయపు పన్ను ప్రవేశపెట్టి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి ఏటా జూలై 24ని 'ఆదాయపు పన్ను దినోత్సవం'గా ప్రకటించింది. 1860లో ప్రారంభమైన ఈ చట్టం, ఆ తర్వాత 1922లోనూ, ఆపై స్వతంత్ర భారత్లో 1962 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిన 'ఇన్కమ్ టాక్స్ యాక్ట్ 1961' ద్వారా నేటి రూపురేఖలను సంతరించుకుంది. 2010 నుండి సీబీడీటీ ఆధ్వర్యంలో పన్ను చెల్లింపుదారుల సేవలను స్మరించుకుంటూ ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
కాగితాల పాలన నుండి పారదర్శక సాంకేతికత వైపు
పూర్వం ఐటీ రిటర్న్లు దాఖలు చేయడానికి కాగితాలు, సుదీర్ఘ వేచిచూసే సమయం పట్టేది. కానీ నేడు డిజిటల్ వ్యవస్థ ద్వారా ముందస్తుగా నింపిన ఐటీఆర్ ఫారాలు, ఫేస్లెస్ అసెస్మెంట్లు అందుబాటులోకి వచ్చాయి. పన్నుల రూపంలో వచ్చే ఆదాయం దేశ రక్షణ, మౌలిక సదుపాయాలు, వైద్యం, విద్య వంటి 100కి పైగా ప్రజా సంక్షేమ పథకాలకు ఖర్చు చేయబడుతోంది. 1961 నాటి చట్టాన్ని మరింత సులభతరం చేస్తూ కొత్త బిల్లును తీసుకురావడం ద్వారా సాధారణ పౌరులకు సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.




