హార్ముజ్ దాడిలో భారత మెరైన్ ఇంజనీర్ మృతి.. వైరల్ అవుతోన్న చివరి మెసేజ్. ఇంతకీ ఏమన్నారంటే.?
Hormuz Attack: హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌక MV GFS Galaxy పై జరిగిన క్షిపణి లాంటి పరికరం దాడిలో మహారాష్ట్ర పుణెకు చెందిన భారతీయ మెరైన్ ఇంజినీర్ హేరంబ్ కర్మార్కర్ మరణించారు.
హార్ముజ్ దాడిలో భారత మెరైన్ ఇంజనీర్ మృతి.. వైరల్ అవుతోన్న చివరి మెసేజ్. ఇంతకీ ఏమన్నారంటే.?
Hormuz Attack: హోర్ముజ్ జలసంధిలో జరిగిన దాడిలో గల్లంతైన భారతీయ మెరైన్ ఇంజినీర్ హేరంబ్ కర్మార్కర్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన హేరంబ్, సైప్రస్ జెండాతో ప్రయాణిస్తున్న కంటైనర్ నౌక MV GFS Galaxyలో థర్డ్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఒమన్ తీరానికి సమీపంలో నౌకపై జరిగిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
దాడికి ముందు కుటుంబానికి పంపిన చివరి సందేశం
హేరంబ్ కర్మార్కర్ దాడికి కొద్దిసేపటి ముందు తన కుటుంబ సభ్యులకు చివరిసారిగా సందేశం పంపారు. "నౌక సురక్షితంగా గల్ఫ్ను దాటింది" అని ఆయన తెలియజేశారు. అయితే ఆ సందేశం తర్వాత ఆయనతో ఉన్న అన్ని రకాల కనెక్షన్స్ ఒక్కసారిగా నిలిచిపోయాయి. అనంతరం జరిగిన దాడిలో ఆయన కనిపించకుండా పోయారు.
హోర్ముజ్ జలసంధిలో నౌకపై దాడి
MV GFS Galaxy నౌక హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న సమయంలో గుర్తుతెలియని క్షిపణి లాంటి పరికరం (Projectile) తాకింది. దీంతో నౌక ఇంజన్ రూమ్ తీవ్రంగా దెబ్బతింది. దాడి తర్వాత నౌకలో మంటలు చెలరేగడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దీంతో సిబ్బంది నౌకను విడిచిపెట్టి లైఫ్బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.
వెంటనే సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
దాడి జరిగిన వెంటనే ఒక సిబ్బంది కనిపించడం లేదని సమాచారం వెలువడింది. తర్వాత అతడే హేరంబ్ కర్మార్కర్ అని నిర్ధారణ అయింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) కూడా ఈ నౌకలో పలువురు భారతీయులు ఉన్నట్లు వెల్లడించింది. ప్రాంతీయ అధికారులతో కలిసి సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపింది. అనంతరం హేరంబ్ మృతదేహాన్ని గుర్తించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆయన మామ వివేక్ టాండన్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు.
హోర్ముజ్ జలసంధిలో పెరుగుతున్న ఉద్రిక్తతలు
ప్రపంచ చమురు, వాణిజ్య రవాణాకు అత్యంత కీలకమైన మార్గాల్లో హోర్ముజ్ జలసంధి ఒకటి. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు పెరగడంతో సముద్ర రవాణా భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడిలో MV GFS Galaxy తీవ్రంగా దెబ్బతినడంతో తన ప్రయాణాన్ని కొనసాగించే పరిస్థితి లేకుండా పోయిందని సముద్ర భద్రతా సంస్థలు వెల్లడించాయి. ఇంజిన్ రూమ్ పూర్తిగా దెబ్బతినడంతో పాటు నౌకలో భారీగా మంటలు చెలరేగినట్లు తెలిపాయి.
పుణెలో విషాదం.. కుటుంబంలో తీవ్ర శోకం
హేరంబ్ కర్మార్కర్ మృతి వార్తతో పుణెలోని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సముద్ర మార్గంలో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఈ యువ ఇంజినీర్ మృతి స్థానికంగా విషాదాన్ని నింపింది. ఆయనకు నివాళులు అర్పిస్తూ పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.




