Indian Railways: దేశంలో అత్యంత పొడవైన, చిన్న రైల్వే స్టేషన్ల పేర్లు ఇవే.. ఆసక్తికర విషయాలు!
Indian Railways: భారతీయ రైల్వేలో అతి చిన్న, పొడవైన పేర్లు గల స్టేషన్లు ఇవే. ఇబ్, ఓడ్ అత్యంత చిన్న పేర్లు. అవి ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
Indian Railways: దేశంలో అత్యంత పొడవైన, చిన్న రైల్వే స్టేషన్ల పేర్లు ఇవే.. ఆసక్తికర విషయాలు!
Indian Railways: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో భారతీయ రైల్వే ఒకటి. నిత్యం కోట్లాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ దేశ రవాణా రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. దేశవ్యాప్తంగా వేలాది రైల్వే స్టేషన్లు విస్తరించి ఉండగా, వాటిలో కొన్ని స్టేషన్లు తమ ప్రత్యేకమైన పేర్లతో ప్రయాణికులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంటాయి. ఎంతో పొడవైన పేర్లు ఉన్న స్టేషన్లు మాత్రమే కాకుండా, కేవలం రెండే రెండు అక్షరాలతో పిలిచే అత్యంత చిన్న పేర్లు కలిగిన స్టేషన్లు కూడా మన రైల్వే నెట్వర్క్లో ఉండటం విశేషం.
భారతదేశంలో అత్యంత చిన్న పేరు కలిగిన రైల్వే స్టేషన్లుగా 'ఇబ్' (Ib), 'ఓడ్' గుర్తింపు పొందాయి. ఈ రెండు స్టేషన్ల పేర్లు ఆంగ్లంలో కేవలం రెండే అక్షరాలతో ముగుస్తాయి. వీటిలో మొదటిదైన 'ఇబ్' స్టేషన్ ఒడిశా రాష్ట్రంలోని ఝార్సుగూడ సమీపంలో ఉంది. స్థానిక 'ఇబ్' నది మీదుగా ఈ స్టేషన్కు ఆ పేరు వచ్చింది. హౌరా-ముంబై ప్రధాన రైలు మార్గంలో ఈ స్టేషన్ ప్రయాణికులకు దర్శనమిస్తుంది. అలాగే రెండవ చిన్న పేరైన 'ఓడ్' స్టేషన్ గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లాలో ఉంది. పశ్చిమ రైల్వే పరిధిలోకి వచ్చే ఈ స్టేషన్ గుండా నిత్యం అనేక ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. కేవలం రెండు అక్షరాల పేర్లతో ఉండే ఈ స్టేషన్ల బోర్డులను చూసి రైలు ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఫొటోలు తీసుకుంటుంటారు.
మరోవైపు దేశంలోనే అత్యంత పొడవైన పేరు కలిగిన రైల్వే స్టేషన్ రికార్డు ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ఒక స్టేషన్కు దక్కింది. చెన్నై-రేణిగుంట రైలు మార్గంలో తమిళనాడు సరిహద్దుకు సమీపంలో ఉన్న 'వెంకటనరసింహరాజువారిపేట' (Venkatanarasimharajuvaripeta) స్టేషన్ పేరు దేశంలోనే అత్యంత పొడవైనది. ఆంగ్లంలో ఏకంగా 28 అక్షరాలు ఉండే ఈ పేరు బోర్డుపై చూడటానికి ఎంతో విచిత్రంగా, విశాలంగా కనిపిస్తుంది. ప్రయాణికులు ఈ పేరును ఒకేసారి పలకడానికి కూడా తడబడుతుంటారు. ఈ స్టేషన్ బోర్డు వద్ద నిలబడి సెల్ఫీలు దిగడం పర్యాటకులకు ఒక ప్రత్యేక అలవాటుగా మారింది.
ప్రస్తుతం భారతీయ రైల్వే ఆధునీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, పెద్ద స్టేషన్ల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ. 25000 కోట్లు భారీ బడ్జెట్ కేటాయించింది. ప్రయాణికులకు ఆధునిక వసతులు కల్పించేందుకు ఒక్కో స్టేషన్ సుందరీకరణ కోసం సుమారు రూ. 20 కోట్లు నుంచి రూ. 50 కోట్లు వరకు నిధులు వెచ్చిస్తున్నారు. ఇలాంటి సరికొత్త అభివృద్ధి పనులతో పాటు దేశంలోని విభిన్న సంస్కృతులు, భౌగోళిక విశేషాలను ప్రతిబింబించే ఇలాంటి అరుదైన స్టేషన్ల పేర్లు భారతీయ రైల్వే వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నాయి. ఈ ఆసక్తికరమైన సమాచారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సైతం విపరీతంగా చక్కర్లు కొడుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.




