Bus Accident: కశ్మీర్‌లో ఘోర ప్రమాదం: లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి!

Bus Accident: జమ్మూ-కశ్మీర్ ఉధంపూర్‌లో ఘోర బస్సు ప్రమాదం. లోయలో పడ్డ బస్సు కారణంగా 15 మంది మృతి చెందారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 20 April 2026 12:27 PM IST
Bus Accident
X

Bus Accident: కశ్మీర్‌లో ఘోర ప్రమాదం: లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి!

Bus Accident: జమ్మూ-కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో సోమవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ భీకర ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. రామ్‌నగర్ నుంచి ఉధంపూర్ వెళ్తున్న బస్సు ఉదయం 10 గంటల సమయంలో 'జాలో' అనే ప్రాంతానికి చేరుకుంది. కొండ ప్రాంతంలోని ప్రమాదకరమైన మలుపు వద్ద దారి సరిగ్గా కనిపించకపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయారు. దీంతో బస్సు వేగంగా లోయలోకి దూసుకెళ్లింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. "ప్రమాద స్థలం నుంచి 15 మృతదేహాలను వెలికితీశాం. మరో 20 మంది క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించాం. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది" అని ఉధంపూర్ డీఐజీ శివకుమార్ శర్మ వెల్లడించారు.

ఈ ఘటనపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. స్థానిక డిప్యూటీ కమిషనర్‌తో మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సైతం ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story