Cloudburst: కశ్మీర్లో విలయం.. ఒక్కసారిగా పగిలిన ఆకాశం.. ముంచెత్తిన వరదలు!
Cloudburst: జమ్మూకశ్మీర్లోని కిశ్త్వాడ్లో భారీ మేఘ విస్ఫోటం సంభవించింది.
Cloudburst: కశ్మీర్లో విలయం.. ఒక్కసారిగా పగిలిన ఆకాశం.. ముంచెత్తిన వరదలు!
Cloudburst: జమ్మూకశ్మీర్లో ప్రకృతి ఉగ్రరూపం దాల్చింది. కిశ్త్వాడ్ జిల్లాలో భారీ మేఘ విస్ఫోటం (Cloudburst) సంభవించింది. దీని ప్రభావంతో ఒక్కసారిగా విరుచుకుపడిన ఆకస్మిక వరదల వల్ల రోడ్లన్నీ బురదమయంగా మారాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.
కిశ్త్వాడ్ పరిధిలో నిర్మాణంలో ఉన్న 540 మెగావాట్ల భారీ జలవిద్యుత్ ప్రాజెక్ట్ ప్రాంతంలో ఈ మేఘ విస్ఫోటం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ప్రాజెక్ట్ సైట్కు వెళ్లే ప్రధాన రహదారిపై భారీ పరిమాణంలో కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. వరద ఉధృతికి కొట్టుకొచ్చిన రాళ్లు, బురద కింద అక్కడ పనిచేస్తున్న పలు వాహనాలు, మిల్లులు, ఇతర భారీ యంత్రాలు పూర్తిగా కూరుకుపోయాయి. అయితే ఈ ఘటనలో జరిగిన ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.
బురద, రాళ్ల కింద కూరుకుపోయిన వాహనాలను, యంత్రాలను బయటకు తీసేందుకు భారీ యంత్రాల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించారు. పరిస్థితి తీవ్రతను బట్టి కేంద్ర, రాష్ట్ర సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళంతో పాటు భారత సైన్యం, స్థానిక పోలీసులు ఈ సంయుక్త రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొని ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు.
కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారులపై నిలిచిపోయిన స్థానిక ప్రజలను, పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. బాధితులకు తక్షణ సహాయం, సమాచారం అందించేందుకు వీలుగా అధికారులు ప్రత్యేక కంట్రోల్ రూమ్తో పాటు హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని అధికారులు హెచ్చరించారు.




