Siddaramaiah: బ్రేక్ఫాస్ట్ భేటీ ముగిసింది.. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా
Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనం. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సిద్ధరామయ్య.
Siddaramaiah: బ్రేక్ఫాస్ట్ భేటీ ముగిసింది.. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా
Siddaramaiah: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఊహించని సంచలన మార్పులు చోటుచేసుకున్నాయి. గత కొన్ని రోజులుగా సాగుతున్న నాయకత్వ మార్పు ఊహాగానాలకు తెరదించుతూ, ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు సిద్ధరామయ్య అధికారికంగా ప్రకటించారు. గురువారం ఉదయం సీఎం నివాసంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, పార్టీకి చెందిన పలువురు కీలక నేతలతో జరిగిన అత్యవసర అల్పాహార విందు (Breakfast Meeting) ముగిసిన అనంతరం సిద్ధరామయ్య మీడియా ముఖంగా ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి తనకు ఎలాంటి బాధ లేదని స్పష్టం చేశారు. "ఇంత కాలం ముఖ్యమంత్రిగా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రస్తుత కేబినెట్ను రద్దు చేయబోతున్నాను. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. నేరుగా వెళ్లి నా రాజీనామా పత్రాన్ని సమర్పిస్తాను" అని సిద్ధరామయ్య వెల్లడించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. హైకమాండ్ ఫార్ములా ప్రకారం ఎట్టకేలకు ఆయనకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. సిద్ధరామయ్య రాజీనామా ప్రకటనతో కర్ణాటక తదుపరి (23వ) ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టడం ఇక అధికారిక లాంఛనమేనని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.




