School Holiday: విద్యార్థులకు శుభవార్త.. స్కూళ్లు, కాలేజీలకు సోమవారం సెలవు!
School Holiday: Keralam has declared a holiday for schools on July 20. అర్జెంటీనా, స్పెయిన్ ఫైనల్ మ్యాచ్ను దృష్టిలో ఉంచుకుని కేరళం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. స్కూళ్లు, కాలేజీలకు సోమవారం సెలవు!
School Holiday: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఫుట్బాల్ ఫీవర్ తారాస్థాయికి చేరింది. అర్జెంటీనా, స్పెయిన్ జట్ల మధ్య ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. భారత కాలమానం ప్రకారం.. న్యూజెర్సీ స్టేడియంలో ఆదివారం రాత్రి 12:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ ఫైనల్ ఫీవర్ కేరళం రాష్ట్రంను కూడా తాకింది. అర్జెంటీనా, స్పెయిన్ జట్ల మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ను దృష్టిలో ఉంచుకుని కేరళం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం (జులై 20) రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్ కాలేజీలు సహా అన్ని విద్యా సంస్థలకు ఈ సెలవు వర్తిస్తుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
ఆదివారం రాత్రి అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ మ్యాచ్ను చూసేందుకు అవకాశం కల్పించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరారు. విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని ప్రతిపక్ష నేతలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. సోమవారం పాఠశాలలకు సెలవు అని విద్యాశాఖ మంత్రి ఎన్ షంసుద్దీన్ సోషల్ మీడియాలో ప్రకటించారు. జనరల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలోని అన్ని పాఠశాలలకు ఈ సెలవు వర్తిస్తుందని చెప్పారు. 'ఇప్పుడు హ్యాపీనా స్టూడెంట్స్' అంటూ పోస్టు చేశారు. ఇక ఫైనల్ మ్యాచ్ సమయంలో విద్యుత్తుకు ఎలాంటి అంతరాయం లేకూండా చూసుకుంటామని మంత్రి సన్నీ జోసెఫ్ ప్రకటించారు.
విద్యార్థులు, ఉపాధ్యాయుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేరళం సీఎం వీడీ సతీశన్ వెల్లడించారు. ఫుట్బాల్కు కేరళంలో ఉన్న అపారమైన ఆదరణ నేపథ్యంలో వేలాది మంది విద్యార్థులు అర్ధరాత్రి వరకు మేల్కొని మ్యాచ్ను వీక్షించే అవకాశం ఉందని, అలాంటి పరిస్థితుల్లో మరుసటి రోజు ఉదయం తరగతులకు హాజరు కావడం ఇబ్బందిగా మారుతుందని ప్రభుత్వం భావించింది. మాజీ విద్యాశాఖ మంత్రి శివన్కుట్టి కూడా ఫైనల్ మ్యాచ్ అర్ధరాత్రి దాటిన తర్వాత ముగియనున్నందున విద్యార్థులు ఉదయం పాఠశాలలకు హాజరు కావడం కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని ప్రతిపక్ష నేతలు, స్టూడెంట్స్ నుంచి వచ్చిన విజ్ఞప్తులను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది.
అయితే ముందుగానే షెడ్యూల్ చేసిన పరీక్షలపై ఎలాంటి ప్రభావం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రకటించిన పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని, వాటిని ఎట్టి పరిస్థితిలో వాయిదా వేయబోమని తెలిపింది. దీంతో విద్యా ప్రణాళికకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. కేరళంలో ఫుట్బాల్కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఫిఫా ప్రపంచ కప్ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు భారీ ఎత్తున మ్యాచ్లను వీక్షిస్తూ సందడి చేస్తుంటారు. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, మాజీ ప్రపంచ ఛాంపియన్ స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుండటంతో.. అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆసక్తిని గౌరవిస్తూ కేరళం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.




