Miss Universe India 2026: మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా 19 ఏళ్ల కేరళ కుట్టి..తన బ్యాక్ గ్రౌండ్ ఇదే
Miss Universe India 2026: మిస్ యూనివర్స్ ఇండియా 2026 పోరులో కేరళకు చెందిన 19 ఏళ్ల కేజియా లిజ్ మెజో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు.
kezia liz mejo
Miss Universe India 2026: రాజస్థాన్ రాజధాని జైపూర్లో అత్యంత కోలాహలంగా జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2026 పోరులో కేరళకు చెందిన 19 ఏళ్ల కేజియా లిజ్ మెజో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 52 మంది ప్రతిభావంతులైన సుందరీమణులను దాటుకుని ఆమె ఈ ప్రతిష్టాత్మక కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.
ఎవరీ కేజియా లిజ్ మెజో?
కేరళకు చెందిన కేజియా లిజ్ మెజో ప్రస్తుతం బెంగళూరులో న్యాయశాస్త్రం (లా) అభ్యసిస్తున్నారు. ఆమె ప్రస్తుతం కొచ్చిలో నివసిస్తున్నారు. మేజో అబ్రహం, సుజా మేజో దంపతుల కుమార్తె అయిన కేజియా, కేవలం మోడలింగ్లోనే కాకుండా క్లాసికల్ డ్యాన్సర్గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత వికాసం వంటి అంశాలపై ఆమె సామాజిక మాధ్యమాల్లో నిరంతరం గళం విప్పుతుంటారు.
చిన్న వయసులోనే అరుదైన మైలురాళ్లు
మోడలింగ్ రంగంలో కేజియా ప్రయాణం ఇప్పటిది కాదు. 2026 ప్రారంభంలోనే ఆమె మిస్ యూనివర్స్ కేరళ 2026 కిరీటాన్ని గెలుచుకున్నారు. ఆ టైటిల్ సాధించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు. అంతకుముందు 2025లో మిస్ టీన్ ఇండియా విజేతగా నిలవడమే కాకుండా, ప్రపంచంలోనే అతిపెద్ద టీన్ బ్యూటీ పేజెంట్లలో ఒకటైన మిస్ టీన్ ఇంటర్నేషనల్ 2025లో ఫస్ట్ రన్నరప్గా నిలిచి అంతర్జాతీయంగా భారత్కు పేరు తెచ్చారు.
అర్ధరాత్రి వేళ కిరీట ధారణ
జైపూర్లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో పోటీ తీవ్రంగా సాగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత 2:50 గంటలకు విజేత పేరును ప్రకటించారు. గత విజేత మణిక విశ్వకర్మ కేజియాకు మెరిసే కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీల్లో తమిళనాడుకు చెందిన వైష్ణవి గణేష్ ఫస్ట్ రన్నరప్గా నిలవగా, గుజరాత్కు చెందిన అనుశ్రీ సత్వలేకర్, మహారాష్ట్రకు చెందిన తేజస్విని శ్రీవాస్తవ, ఉత్తరాఖండ్కు చెందిన అనుభా వశిష్ట్ తదుపరి స్థానాల్లో నిలిచారు.
దిగ్గజాల సమక్షంలో విజయం
ఈ అందాల పోటీకి బాలీవుడ్ నటీమణులు సుష్మితా సేన్, సెలినా జైట్లీ, ఉర్వశి రౌతేలా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. 1994లో సుష్మితా సేన్, 2001లో సెలినా జైట్లీ, 2015లో ఉర్వశి రౌతేలా భారత్ తరఫున మెరిసిన అనుభవం ఉండటంతో, వారి సూచనలు ఈ పోటీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజేతగా నిలిచిన కేజియా ఈ ఏడాది చివర్లో ప్యూర్టో రికోలో జరగబోయే 75వ మిస్ యూనివర్స్ గ్లోబల్ పోటీల్లో భారత ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఉర్వశి కాస్ట్యూమ్పై వెల్లువెత్తిన చర్చ
ఈ కార్యక్రమానికి హాజరైన నటి ఉర్వశి రౌతేలా ధరించిన త్రివర్ణ పతాకం థీమ్ డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల కాంబినేషన్లో రూపొందించిన ఈ దుస్తులు దేశభక్తిని చాటిచెప్పినప్పటికీ, గ్లామర్ వేదికపై జాతీయ జెండా రంగులను ఉపయోగించడం సరైనదేనా అనే చర్చ సామాజిక మాధ్యమాల్లో నడిచింది.
చదువుతో పాటు మోడలింగ్ రంగంలో వరుస విజయాలు సాధిస్తున్న కేజియా లిజ్ మెజో, అంతర్జాతీయ మిస్ యూనివర్స్ వేదికపై కూడా భారత్ తరఫున ఘనవిజయం సాధించాలని దేశప్రజలు కోరుకుంటున్నారు.




