అల్జీమర్స్ చికిత్సలో కొత్త అధ్యాయం.. భారత్లో లెకెంబీ అందుబాటులోకి
ప్రారంభ దశ అల్జీమర్స్ చికిత్సకు లెకెంబిని భారత్లో ఐసై సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది దేశంలో తొలి డిసీజ్ మోడిఫైయింగ్ థెరపీ.
Alzheimer's Treatment India
ప్రారంభ దశ అల్జీమర్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగుగా జపాన్కు చెందిన ఔషధ సంస్థ ఐసై (Eisai) భారత్లో లెకెంబి (Lecanemab) ఔషధాన్ని అధికారికంగా ప్రారంభించింది. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDSCO) నుంచి మార్కెటింగ్ అనుమతి పొందిన అనంతరం ఈ మందును దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ ప్రకటించింది.
లెకెంబి ఔషధం మైల్డ్ కాగ్నిటివ్ ఇంపెయిర్మెంట్ (MCI) మరియు ప్రారంభ దశ అల్జీమర్స్ కారణంగా వచ్చే స్వల్ప డిమెన్షియా ఉన్న రోగుల చికిత్సకు ఉపయోగించనున్నారు. దీంతో అల్జీమర్స్కు సంబంధించిన డిసీజ్ మోడిఫైయింగ్ థెరపీ (DMT) భారత్లో తొలిసారిగా అందుబాటులోకి వచ్చినట్లైంది.
భారత్లో వృద్ధుల సంఖ్య పెరుగుతుండటం, అల్జీమర్స్ను ఆలస్యంగా గుర్తించడం, వ్యాధిపై అవగాహన తక్కువగా ఉండటం వంటి కారణాలతో డిమెన్షియా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. AIIMS–USC LASI అధ్యయనం ప్రకారం 2023 నాటికి దేశంలో 60 ఏళ్లు పైబడిన సుమారు 88 లక్షల మంది డిమెన్షియాతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య 2036 నాటికి దాదాపు రెండింతలు అయ్యే అవకాశం ఉందని అంచనా.
లెకెంబి ఒక హ్యూమనైజ్డ్ మోనోక్లోనల్ యాంటీబాడీ. ఇది మెదడులో పేరుకుపోయే అమిలాయిడ్-బీటా (Amyloid-beta) ప్రోటీన్ గడ్డలను లక్ష్యంగా చేసుకుని వాటిని తొలగించడంతో పాటు కొత్తగా పేరుకుపోకుండా సహాయపడుతుందని ఐసై వెల్లడించింది. దీంతో ప్రారంభ దశలోనే వ్యాధి పురోగతిని మందగించే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.




