Jail Love Story: ఖైదీతో ఏడడుగులు వేసిన జైలు సూపరింటెండెంట్
Jail Love Story: సత్నా జైలు డిప్యూటీ జైలర్ ఫిరోజా ఖాతూన్, అదే జైలులో 14 ఏళ్లు శిక్ష అనుభవించిన మాజీ ఖైదీ ధర్మేంద్రను వివాహం చేసుకున్నారు.
Jail Love Story: ఖైదీతో ఏడడుగులు వేసిన జైలు సూపరింటెండెంట్
Madhya Pradesh: ప్రేమకు మతం లేదు.. అంతస్తుల భేదం లేదు.. అని అంటుంటారు. కానీ, మధ్యప్రదేశ్లోని సత్నాలో జరిగిన ఒక వివాహం చూస్తే ప్రేమకు ఖైదీ సంకెళ్లు కూడా అడ్డుకావు అని నమ్మక తప్పదు. జైలు నిబంధనలు అమలు చేయాల్సిన ఒక మహిళా అధికారిణి, అదే జైలులో హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీతో ప్రేమలో పడి, చివరకు అతడినే పెళ్లి చేసుకున్న ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది. సత్నా కేంద్ర కారాగారంలో డిప్యూటీ జైలర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఫిరోజా ఖాతూన్ వృత్తిరీత్యా ఎంతో కఠినంగా ఉండేవారు. అదే సమయంలో, హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడి ధర్మేంద్ర అలియాస్ అభిలాష్ అదే జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. దాదాపు 14 ఏళ్ల జైలు జీవితం గడుపుతున్న క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా కాలక్రమేణా గాఢమైన ప్రేమగా మారింది.
విడుదల తర్వాత వివాహం..
2020లో ధర్మేంద్ర తన శిక్షా కాలాన్ని పూర్తి చేసుకుని జైలు నుంచి విడుదలయ్యాడు. సాధారణంగా జైలు దాటి బయటకు వచ్చాక పాత పరిచయాలను మర్చిపోతుంటారు. కానీ, వీరిద్దరి ప్రేమ మాత్రం చెక్కుచెదరలేదు. బయట ప్రపంచంలో మళ్ళీ కలుసుకున్న వీరు, మతం ,సామాజిక అడ్డంకులను ఎదురించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఫిరోజా ఖాతూన్ ముస్లిం కావడంతో వీరి వివాహానికి కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ, వెనక్కి తగ్గకుండా లవ్ కుష్ నగర్లో హిందూ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం ఘనంగా జరిగింది. మా జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కు మాకు ఉంది. మేము ఈ బంధంతో ఎంతో సంతోషంగా ఉన్నాం అని ఫిరోజా గర్వంగా చెబుతున్నారు.
ఖైదీలకు సంస్కరణలు నేర్పే చోట.. ఒక ఖైదీనే తన జీవిత భాగస్వామిగా ఎంచుకున్న ఈ అధికారిణి ధైర్యాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సినిమాల్లో మాత్రమే ఇలాంటివి జరుగుతాయనుకున్నాం.. రియల్ లైఫ్లో కూడా ఇలాంటి ప్రేమకథలు ఉంటాయా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.




