కొడుకు ప్రేమకు తండ్రి బలి: వృద్ధుడిపై దాడి చేసి.. బలవంతంగా మూత్రం తాగించారు!
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రైసెన్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. తన కొడుకు ఓ యువతితో పారిపోయాడన్న కోపంతో, యువతి తరపు బంధువులు వృద్ధుడైన తండ్రిని అపహరించి, చిత్రహింసలు పెట్టి, మూత్రం తాగించిన ఘటన సంచలనం రేపుతోంది.
కొడుకు ప్రేమకు తండ్రి బలి: వృద్ధుడిపై దాడి చేసి.. బలవంతంగా మూత్రం తాగించారు!
Madhya Pradesh: కొడుకు చేసిన పనికి వృద్ధుడైన తండ్రికి నరకం చూపించారు కొందరు కిరాతకులు. ప్రేమించిన యువతితో యువకుడు పారిపోయాడన్న కక్షతో, ఆ వృద్ధుడిని అపహరించి, దారుణంగా కొట్టి, బలవంతంగా మూత్రం తాగించిన అమానవీయ ఘటన మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలో చోటుచేసుకుంది.
అగరియా మార్ఖో గ్రామానికి చెందిన బిహారీ బంజారా కుమారుడు, పక్క జిల్లా విదిషాకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ ఇటీవల ఇంటి నుంచి పారిపోయారు. దీంతో ఆగ్రహానికి గురైన యువతి బంధువులు సుమారు 10-12 మంది కలిసి బిహారీ ఇంటిపై దాడి చేశారు. ఆయన భార్యను తీవ్రంగా కొట్టి, బిహారీని బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని 150 కిలోమీటర్ల దూరంలోని రాజ్గఢ్ జిల్లాకు తీసుకెళ్లారు.
అక్కడ బిహారీని చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టడమే కాకుండా, ఒక బాటిల్లోని మూత్రాన్ని బలవంతంగా తాగించారు. "వారు నన్ను మూత్రం తాగమని బలవంతం చేశారు. శ్యామ్లాల్, మల్ఖాన్, రోడ్జీ సహా 12 మంది నన్ను దారుణంగా హింసించారు" అని బాధితుడు రోదిస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. నిందితులు అంతటితో ఆగకుండా ఈ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది.
తొలుత ఫిర్యాదు చేసినా రైసెన్ పోలీసులు పట్టించుకోలేదని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ప్రస్తుతం రైసెన్ మరియు రాజ్గఢ్ పోలీసులు సంయుక్తంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.




