Devendra Fadnavis: టీసీఎస్ కేసుపై సీఎం ఫడణవీస్ సీరియస్: 'ముఠా ప్రమేయం ఉంది.. వదిలిపెట్టం!'
Devendra Fadnavis: నాసిక్ టీసీఎస్ క్యాంపస్లో లైంగిక వేధింపులు, మతమార్పిడి కేసుపై సీఎం దేవేంద్ర ఫడణవీస్ సీరియస్. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపిస్తామని వెల్లడి
Devendra Fadnavis: టీసీఎస్ కేసుపై సీఎం ఫడణవీస్ సీరియస్: 'ముఠా ప్రమేయం ఉంది.. వదిలిపెట్టం!'
Devendra Fadnavis: నాసిక్ టీసీఎస్ క్యాంపస్లో మహిళా ఉద్యోగులపై జరిగిన లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడిల అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన వెనుక ఒక వ్యవస్థీకృత ముఠా హస్తం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన వెల్లడించారు.
ఇది కేవలం వ్యక్తుల మధ్య జరిగిన గొడవ కాదని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని సీఎం పేర్కొన్నారు. బాధ్యులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ కేసు లోతుగా విచారించడానికి రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా రంగంలోకి దించుతామని ఆయన స్పష్టం చేశారు. టీసీఎస్ యాజమాన్యం కూడా ఈ ఘటనలను ఖండించిందని, దర్యాప్తుకు సహకరిస్తోందని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు వెల్లడించారు.
హెచ్ఆర్ (HR) విభాగంపై పోలీసుల ఆగ్రహం:
నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కార్నిక్ ఈ కేసులో కంపెనీ అంతర్గత వైఫల్యాలను ఎండగట్టారు. బాధితులు పలుమార్లు హెచ్ఆర్ విభాగానికి మొరపెట్టుకున్నా, వారు కనీస చర్యలు తీసుకోలేదు. "పని ప్రదేశాల్లో ఇలాంటివి సహజం" అంటూ బాధితులను పోలీసులు దగ్గరకు వెళ్లకుండా హెచ్ఆర్ సిబ్బంది అడ్డుకున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. నిందితులకు అతివాద భావజాలం ఉన్న గ్రూపులతో సంబంధాలున్నాయనే కోణంలో విచారణ సాగుతోందన్నారు.
కేసు నేపథ్యం:
ఈ దారుణం ఒక మహిళా ఉద్యోగి ధైర్యంగా ముందుకు రావడంతో వెలుగులోకి వచ్చింది. ఒక ఉద్యోగి తన సహోద్యోగిపై పెళ్లి పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టాక మరో ఏడుగురు మహిళా ఉద్యోగులు ధైర్యంగా ముందుకు వచ్చి తమపై జరిగిన అఘాయిత్యాలను వివరించారు. 2022 ఫిబ్రవరి నుండి 2026 మధ్య కాలంలో ఈ వేధింపులు, మత మార్పిడి ప్రయత్నాలు జరిగినట్లు బాధితులు వాపోయారు.




