Custodial Death : కస్టోడియల్ డెత్.. 9 మంది పోలీసులకు జీవిత ఖైదు.!

Custodial Death : మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల నాటి కస్టోడియల్ డెత్ (Custodial Death) కేసులో వాషిమ్ జిల్లా సెషన్స్ కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది.

G Krishna
Published on: 3 July 2026 10:38 AM IST
Verdict
X

Verdict

Custodial Death : మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల నాటి కస్టోడియల్ డెత్ (Custodial Death) కేసులో వాషిమ్ జిల్లా సెషన్స్ కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. 23 ఏళ్ల యువకుడి మృతికి కారణమైన నాటి రిసోద్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌తో పాటు మొత్తం తొమ్మిది మంది పోలీసులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. బాధితుడి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఒకటిన్నర దశాబ్ద కాలంగా జరిపిన సుదీర్ఘ న్యాయపోరాటానికి ఎట్టకేలకు న్యాయం లభించింది.

అసలేం జరిగింది?

ఈ ఘోర ఉదంతం 2011 మే 10వ తేదీన జరిగింది. పార్ధి సామాజిక వర్గానికి చెందిన బేగ్యా పవార్ అనే యువకుడిని విచారణ నిమిత్తం పోలీసులు తెల్లవారుజామున 3 గంటల సమయంలో అతని ఇంటి నుంచి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఎలాంటి క్రిమినల్ రికార్డు లేని ఆ యువకుడిపై స్టేషన్ లోపల పోలీసులు విచక్షణారహితంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి, దారుణంగా దాడి చేశారు. పోలీసుల చేతుల్లో తీవ్రంగా దెబ్బలు తిన్న ఆ యువకుడు కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసుల నిరాకరణ.. రంగంలోకి సీఐడీ

కుమారుడి మరణంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన పవార్ తల్లిదండ్రులను నాటి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. తమ స్టేషన్ ఆఫీసర్ పేరు నిందితుల జాబితాలో ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. దీంతో బాధితుడి కుటుంబం, పార్ధి సామాజిక వర్గ ప్రతినిధులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగడంతో కేసు నమోదు చేయక తప్పలేదు. ఆ తర్వాత మృతదేహానికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో యువకుడి శరీరంపై అనేక ఫ్రాక్చర్లు ఉన్నట్లు తేలింది. ఈ కేసు తీవ్రతను బట్టి మహారాష్ట్ర ప్రభుత్వం విచారణను సీఐడీ (CID)కి అప్పగించింది. సీఐడీ అధికారులు లోతైన దర్యాప్తు జరిపి, పోలీసుల చిత్రహింసల వల్లే యువకుడు చనిపోయాడని బలమైన ఆధారాలతో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

15 ఏళ్ల తర్వాత తీర్పు

గత 15 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసు విచారణ ముగియడంతో వాషిమ్ కోర్టు నిందితులైన తొమ్మిది మంది పోలీసులను దోషులుగా తేల్చింది. నాటి రిసోద్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మహదేవ్ మానిక్ ధాండేతో పాటు మరో ఎనిమిది మంది పోలీసులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. నిందితుల్లో ధాండే సహా ఇద్దరు పోలీసులు ఇప్పటికే ఉద్యోగ విరమణ పొందడం గమనార్హం. ప్రస్తుతం ఈ తొమ్మిది మందిని వాషిమ్ జైలుకు తరలించారు.

న్యాయం గెలిచింది

కోర్టు తీర్పుపై పవార్ వృద్ధ తల్లిదండ్రులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. "15 ఏళ్ల నిరీక్షణ తర్వాత మాకు ఎట్టకేలకు న్యాయం జరిగింది" అని వారు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుమారుడు ఎలాంటి తప్పు చేయకపోయినా పోలీసులు విచారణ పేరుతో తీసుకెళ్లి చంపేశారని, ఈ పోరాటంలో తమకు అండగా నిలిచిన కోర్టుకు, సీఐడీ దర్యాప్తు బృందానికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story