Mallikarjun Kharge: రాత్రివేళ ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు ఏంటి ప్రధానీ?.. పీఎం మోదీపై ఖర్గే ఘాటు వ్యాఖ్యలు!
Mallikarjun Kharge: పేపర్ లీకేజీల నిరోధక సవరణ బిల్లుపై రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Mallikarjun Kharge: రాత్రివేళ ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు ఏంటి ప్రధానీ?.. పీఎం మోదీపై ఖర్గే ఘాటు వ్యాఖ్యలు!
Mallikarjun Kharge: దేశవ్యాప్తంగా కలకలం రేపిన పేపర్ లీకేజీల వ్యవహారం మరియు 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (నివారణ చర్యలు) సవరణ బిల్లు-2026'పై రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థుల సుదీర్ఘ పోరాటాలు, రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనలకు భయపడే ప్రభుత్వం ఈ బిల్లును సభ ముందుకు తెచ్చిందని ఆరోపించారు.
సభలో ఖర్గే మాట్లాడుతూ.. 2024 నుంచే పేపర్ లీకేజీ వ్యతిరేక చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని తాము కోరుతున్నప్పటికీ కేంద్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. గతంలో తొందరపాటుతో తెచ్చిన చట్టం విఫలం కావడంతోనే ఇప్పుడు సవరణలు చేయాల్సి వచ్చిందన్నారు. ప్రజా గ్రహాన్ని చల్లార్చడానికి, తమ సీట్లను కాపాడుకోవడానికి మాత్రమే ప్రభుత్వం ఈ మార్పులు తెచ్చిందని, ఇది అసలు సమస్యను పరిష్కరించదని స్పష్టం చేశారు.
అర్థరాత్రి ఇన్స్టాగ్రామ్ సందేశాలేంటి ప్రధానీ?
ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడటంపై ఖర్గే తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. "విద్యార్థులను ఉద్దేశించి నేరుగా మాట్లాడేందుకు ప్రధానికి సమయం దొరకలేదా? అర్థరాత్రి సమయంలో ఇన్స్టాగ్రామ్లో సందేశాలు ఇస్తున్నారు. ఉద్యమం ఊపందుకున్నాక, ధర్మేంద్ర ప్రధాన్ను విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తప్పించి పరిస్థితిని తగ్గించే ప్రయత్నం చేశారు" అని ఖర్గే వ్యాఖ్యానించారు.
అమిత్ షా రాజీనామాకు డిమాండ్!
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ మరియు పెల్లెట్ గన్ల దాడికి బాధ్యులెవరని ఖర్గే ప్రశ్నించారు. బీహార్లో విద్యార్థులపై ఎస్-47 ఉపయోగించే స్థాయికి వెళ్లడం దారుణమని, వారు ఉగ్రవాదులు కాదని, దేశ భవిష్యత్తు అని గుర్తుచేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కాపాడేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
"విద్యార్థులపై జరిగిన దాడులకు హోం మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలి. దేశానికి సమాధానం చెప్పలేకపోతే ఆయన వెంటనే రాజీనామా చేయాలి" అని ఖర్గే డిమాండ్ చేశారు. కేవలం వ్యక్తులను మార్చడం వల్ల ఉపయోగం లేదని, విద్యా వ్యవస్థల్లో మూలమట్టంగా మార్పులు రాకపోతే భవిష్యత్తులో మరిన్ని పేపర్ లీక్లు జరుగుతాయని హెచ్చరించారు.




