Mamata Banerjee : మమతా కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. బెంగాల్‌లో భగ్గుమన్న రాజకీయం.!

పశ్చిమ బెంగాల్‌లోని హలీషహర్‌లో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసు కస్టడీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) కార్యకర్త బిర్జూ

G Krishna
Published on: 9 Aug 2026 7:07 PM IST
mamata banerjee
X

mamata banerjee

పశ్చిమ బెంగాల్‌లోని హలీషహర్‌లో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసు కస్టడీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) కార్యకర్త బిర్జూ కేఓట్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాన్వాయ్‌పై ఆందోళనకారులు ఒక్కసారిగా దాడికి దిగారు. ఆందోళనకారులు ఆమె వాహనాన్ని ముట్టడించి, కారుపై బురద చల్లడంతో పాటు నీళ్ల సీసాలు, రాళ్లు , చెప్పులు విసిరారు. "దొంగ", "దొంగల రాణి" అంటూ మమతాకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారింది.

హత్యాయత్నం దాడి.. పోలీసుల తీరుపై మమతా ఆగ్రహం

ఈ దాడి తీవ్రతపై మమతా బెనర్జీ మాట్లాడుతూ, పోలీసుల సమక్షంలోనే అరాచక శక్తులు తన కారుపైకి పెద్ద పెద్ద రాళ్లను విసిరారని ఆరోపించారు. వాహనం కిటికీలు తెరిచి ఉండి ఉంటే తన తల పగిలిపోయేదని, ఇది ప్రాణాంతకమైన దాడి అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకోకుండా బిజెపికి రక్షణ కల్పిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాగా, ఈ దాడిని టిఎంసి ఎంపీ కల్యాణ్ బెనర్జీ "ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిన హత్యాయత్నం"గా అభివర్ణించారు. ప్రతిపక్ష నేత సువేందు అధికారి సూచనల మేరకే బిజెపి కార్యకర్తలు మమతా బెనర్జీని చంపాలనే ఉద్దేశంతోనే ఈ రాళ్లదాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

ఆరోపణలను ఖండించిన బీజేపీ నేతలు

ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శమీక్ భట్టాచార్య స్పందిస్తూ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇందులో తమ పార్టీ కార్యకర్తల ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. రాళ్లు, బురద లేదా చెప్పులు విసిరే సంస్కృతిని బీజేపీ మద్దతు ఇవ్వదని, ఇలాంటి ఘటనలు రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చుతాయని పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా బీజేపీ నేత అగ్నిమిత్ర పాల్ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ఒక మహిళ అని, సీనియర్ నాయకురాలని గుర్తుచేస్తూ, రాజకీయంలో భౌతిక దాడులకు స్థానం లేదన్నారు. బీజేపీ పేరుతో ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడినా అది తప్పేనని ఆమె స్పష్టం చేశారు.

వివాదానికి కారణమైన టీఎంసీ కార్యకర్త కస్టడీ మరణం

అవినీతి, వసూళ్ల ఆరోపణలపై అరెస్టయిన టీఎంసీ కార్యకర్త బిర్జూ కేఓట్, పోలీసు కస్టడీలో ఉండగా ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో మృతి చెందాడు. అతడు గుండెపోటుతో మరణించాడని పోలీసులు చెబుతుండగా, కస్టడీలో తీవ్రంగా హింసించడం వల్లే చనిపోయాడని అతని భార్య ఆరోపిస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసి రాజకీయం రగల్చడంతో, కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో ఈ దాడి చోటుచేసుకుంది. పరిస్థితి చేయిదాటకుండా పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని మమతా బెనర్జీ కాన్వాయ్‌ను సురక్షితంగా అక్కడి నుండి తరలించారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story