Mekedatu Dam : మేకదాతు ఫైట్.. విజయ్ నిర్ణయంపై ఉత్కంఠ.!
Mekedatu Dam : కావేరి నదిపై కర్ణాటక ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన మేకదాతు డ్యామ్ ప్రాజెక్ట్ వ్యవహారం మరోసారి రెండు పొరుగు రాష్ట్రాల..
CM-Vijay
Mekedatu Dam : కావేరి నదిపై కర్ణాటక ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన మేకదాతు డ్యామ్ ప్రాజెక్ట్ వ్యవహారం మరోసారి రెండు పొరుగు రాష్ట్రాల మధ్య తీవ్ర కలకలం రేపుతోంది. మేకదాతు రిజర్వాయర్ నిర్మాణంతో పాటు ఇరు రాష్ట్రాల మధ్య నడుస్తున్న నదీ జలాల వివాదాలపై ముఖాముఖి ద్విపాక్షిక చర్చలు జరిపేందుకు కర్ణాటక సీఎం పంపిన ఆహ్వానాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తక్షణమే తిరస్కరించాలని అక్కడి ప్రధాన రైతు సంఘాల నాయకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై ఎలాంటి చర్చలు జరగాలన్నా, అది కేవలం రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన 'కావేరి నీటి యాజమాన్య ప్రాధికార సంస్థ' (CWMA) ఆధ్వర్యంలో మాత్రమే సాగాలని వారు స్పష్టం చేస్తున్నారు.
సీఎం బెంగళూరు టూర్ పై పెరిగిన ఉత్కంఠ
మరోవైపు.. సీఎం విజయ్ కర్ణాటక పర్యటనపై తమిళనాడు రాజకీయంలో సస్పన్స్ కొనసాగుతోంది. తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి వినోత్ తన పాత ప్రకటన నుంచి అకస్మాత్తుగా వెనక్కి తగ్గడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 3వ తేదీన సీఎం విజయ్ నేరుగా బెంగళూరు వెళ్లి కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరుపుతారని మొదట్లో ప్రకటించిన మంత్రి వినోత్, తాజాగా ఆ వ్యాఖ్యలను సవరించుకున్నారు. ముఖ్యమంత్రి బెంగళూరు పర్యటనపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, అధికారిక హెడ్ ఆఫీస్ నుంచి ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలని కోరారు. మేకదాతు వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కడితే దిగువన ఉన్న తమిళనాడుకు రావలసిన కావేరి నీటి ప్రవాహం గణనీయంగా తగ్గిపోతుందని, ఇది డెల్టా ప్రాంత రైతులకు కోలుకోలేని దెబ్బ అని అక్కడి వ్యవసాయదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీడబ్ల్యూఎంఏ పరిధిలోనే చర్చలు జరగాలి..
మయిలాడుతురైలో నిర్వహించిన రైతుల సమన్వయ కమిటీ జిల్లా నిర్వాహకుల అత్యవసర సమావేశంలో ప్రముఖ రైతు నాయకుడు పి.ఆర్. పాండియన్ మాట్లాడుతూ.. కర్ణాటక సీఎంతో సీఎం విజయ్ చర్చలకు వెళ్లడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. "గత చరిత్రను పరిశీలిస్తే, ఇలాంటి ప్రత్యక్ష ద్విపాక్షిక చర్చల వల్ల సమస్యలు పరిష్కారం కాకపోగా, పరస్పర విభేదాలు పెరిగి తీవ్ర ఘర్షణలకు దారితీశాయి. కావేరి నదిపై మేకదాతు డ్యామ్ నిర్మాణం, నీటి విడుదలపై తమిళనాడు ముఖ్యమంత్రి కర్ణాటకకు వెళ్లి మాట్లాడటం చట్టపరంగా అస్సలు చెల్లదు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు, భారత రాజ్యాంగానికి స్పష్టమైన ఉల్లంఘన" అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా సీడబ్ల్యూఎంఏ ఏర్పడిందని, అత్యున్నత నాయకత్వంలో ఈ అథారిటీ పనిచేస్తున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు విడిగా కలవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని తేల్చి చెప్పారు.
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు..
తమిళనాడు-కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన హోసూర్-బెంగళూరు సరిహద్దు వద్ద తమిళనాడు నమోదు ఉన్న వాహనాలను నిలిపివేస్తున్నారని, రెండు రాష్ట్రాల మధ్య కావాలని భాషా భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని రైతు నాయకులు ఆరోపించారు. మరోవైపు తంజావూరులో రూ. 70 లక్షల కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో చేపట్టిన 6 కిలోమీటర్ల డ్రైనేజీ కాలువల పూడికతీత పనులను ప్రారంభించిన మంత్రి వినోత్, ఈ వివాదంపై స్పందిస్తూ సీఎం నిర్ణయమే ఆఖరిదని వెల్లడించారు. మేకదాతు విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, సమస్యను కేవలం సిడబ్ల్యూఎమ్ఏ ద్వారానే పరిష్కరించుకోవాలని తమిళనాడు వ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.




