Mother Love: ప్రాణాలకు తెగించి బిడ్డలను కాపాడుకున్న తల్లి.. ఒళ్లు గగుర్పొడిచే సీన్

Mother Love: బీహార్‌లోని సమస్తిపూర్ రైల్వే స్టేషన్‌లో ఊపిరి బిగబట్టే ఘటన చోటుచేసుకుంది.

Naresh.k
Published on: 16 May 2026 8:12 AM IST
Mother Love
X

Mother Love: ప్రాణాలకు తెగించి బిడ్డలను కాపాడుకున్న తల్లి.. ఒళ్లు గగుర్పొడిచే సీన్

Bihar : సమయం ఆదా చేసుకోవాలనే ఒకే ఒక్క తప్పుడు ఆలోచన.. క్షణాల్లో ప్రాణాల మీదకు తెచ్చింది. రైలు వేగంగా దూసుకొస్తుంటే, తప్పించుకునే దారి లేక, ఆ చావు నోట్లోకి వెళ్లకుండా ఇద్దరు బిడ్డలను కాపాడుకోవడానికి ఓ తల్లి చేసిన సాహసం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా షాపూర్ పటోరి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఒళ్లు గగుర్పొడిచే ఘటన సోషల్ మీడియాను కుదిపేస్తోంది.

ఆ రోజు స్టేషన్ అంతా ప్రయాణికులతో సందడిగా ఉంది. కొందరు మహిళలు తమ ఇద్దరు చిన్న పిల్లలను తీసుకుని, మెట్లు ఎక్కే ఓపిక లేకో లేదా రెండు నిమిషాల సమయం ఆదా అవుతుందనో కానీ.. ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కాదని నేరుగా రైల్వే ట్రాక్‌లు దాటడం ప్రారంభించారు. సరిగ్గా వారు ట్రాక్ మధ్యలోకి వచ్చేసరికి, ఊహించని విధంగా ఒక రైలు అత్యంత వేగంగా అదే ట్రాక్‌పై దూసుకురావడం మొదలైంది. రైలు హారన్ శబ్దం వినబడే సరికి వారి కాళ్ల కింద భూమి కదిలింది. ప్లాట్‌ఫారమ్ పైకి ఎక్కడానికి సమయం లేదు, వెనక్కి వెళ్లే అవకాశం అసలే లేదు. చావు కళ్లముందే కనిపిస్తోంది. ఆ స్థితిలో, క్షణాల్లో ఆ తల్లిలోని రక్షణ కవచం మేల్కొంది.

రైలు వేగానికి ఎక్కడ బిడ్డలు కొట్టుకుపోతారో అని భయపడిన ఆ తల్లి, ప్లాట్‌ఫారమ్ కింద ఉన్న చిన్న అంచు వద్ద ఇద్దరు పిల్లలను గట్టిగా కూర్చోబెట్టింది. వెంటనే తాను వారిపై బోర్లా పడుకుని, బిడ్డలకు ఏమీ కాకుండా తన దేహాన్నే ఒక గోడలా మార్చేసింది. రైలు అత్యంత వేగంగా, గాలిని చీల్చుకుంటూ ఆ తల్లిని రాసుకుంటూ వెళ్ళిపోయింది. వైరల్ అవుతున్న వీడియోలో చూస్తే.. రైలు వేగానికి వచ్చే గాలి ఒత్తిడికి ఆ మహిళ పట్టాల వైపుకు లాగంత ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. కానీ, పక్కనే ఉన్న మరో మహిళా ప్రయాణీకురాలు గుండె నిబ్బరం చేసుకుని, ఆ తల్లిని గట్టిగా పట్టుకుని ఉంచడంతో ఘోర ప్రమాదం తప్పింది. రైలు వెళ్ళిపోగానే ప్లాట్‌ఫారమ్ పై ఉన్న జనం పరుగెత్తుకుంటూ వచ్చి వారిని పైకి లాగారు.

ఈ భీకర ఘటనలో ఆ తల్లికి గాయాలైనప్పటికీ, అదృష్టవశాత్తూ పిల్లలతో సహా అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే నెటిజన్లు ఈ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. కేవలం రెండు నిమిషాలు మిగుల్చుకోవడం కోసం చిన్న పిల్లల ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతవరకు న్యాయం? అసలు బ్రిడ్జి ఉండగా ట్రాక్ ఎందుకు దాటాలి? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి వారిపై రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story