Prateek Yadav : ములాయం కుమారుడి ఆకస్మిక మృతి.. లక్నోలో విషాదం.!
Prateek Yadav : సమాజ్ వాదీ పార్టీ (SP) వ్యవస్థాపకుడు, దివంగత నేత ములాయం సింగ్ యాదవ్ రెండో కుమారుడు ప్రతీక్ యాదవ్ (38) కన్నుమూశారు. బుధవారం..
Prateek-Yadav
Prateek Yadav : సమాజ్ వాదీ పార్టీ (SP) వ్యవస్థాపకుడు, దివంగత నేత ములాయం సింగ్ యాదవ్ రెండో కుమారుడు ప్రతీక్ యాదవ్ (38) కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున లక్నోలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణంతో యాదవ్ కుటుంబంలో , రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. పోలీసుల సమాచారం ప్రకారం, బుధవారం ఉదయం 6:15 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ప్రతీక్ యాదవ్ను లక్నోలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునేలోపే ఆయన మరణించారని, 'బ్రాట్ డెడ్' (Brought Dead) గా వైద్యులు ప్రకటించారు. ఆ సమయంలో ఆయన భార్య, బీజేపీ నేత అపర్ణా యాదవ్ అక్కడ లేరు. మరణానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (KGMU) లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ప్రాథమిక పరిశీలనలో శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదు.
అనారోగ్యంతో పోరాటం
ప్రతీక్ యాదవ్ గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం (Blood Clot) వల్ల చికిత్స పొందుతున్నారు. బుధవారం ఉదయం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించి, స్పందించడం మానేయడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు.
ఎవరీ ప్రతీక్ యాదవ్?
ప్రతీక్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ , ఆయన రెండో భార్య సాధన దంపతుల కుమారుడు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు ఆయన సోదరుడు అవుతారు. యూకేలోని లీడ్స్ యూనివర్సిటీ నుండి ఎంబీఏ (MBA) పూర్తి చేసిన ప్రతీక్, వ్యాపారవేత్తగా , రియల్ ఎస్టేట్ డెవలపర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. రాజకీయ కుటుంబంలో పుట్టినప్పటికీ, ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు ఎప్పుడూ దూరంగానే ఉన్నారు.
ఫిట్నెస్ , జంతు ప్రేమికుడిగా గుర్తింపు
ప్రతీక్ యాదవ్కు ఫిట్నెస్ అంటే అమితమైన ఇష్టం. 2012లో ఒక అంతర్జాతీయ బాడీబిల్డింగ్ వెబ్సైట్ ఆయనను "ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ది మంత్"గా గుర్తించింది. తండ్రి ములాయం సింగ్ ఇచ్చిన స్ఫూర్తితోనే తాను ఫిట్నెస్ వైపు అడుగులు వేశానని ఆయన తరచుగా చెప్పేవారు. అలాగే ఆయన జంతు ప్రేమికుడు కూడా. మూగజీవాల సంరక్షణ కోసం పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. 2017లో సుమారు రూ. 5 కోట్ల విలువైన లాంబోర్ఘిని కారు కొనుగోలు చేసినప్పుడు ఆయన కొంత వివాదాన్ని ఎదుర్కొన్నారు, అయితే తాను ట్యాక్సులు కడుతున్నానని, లోన్ ద్వారానే కారు కొన్నానని ఆయన స్పష్టత ఇచ్చారు.
వ్యక్తిగత జీవితం , వివాహం
ప్రతీక్ యాదవ్ , అపర్ణ యాదవ్ ఎనిమిదేళ్ల ప్రేమ తర్వాత 2011లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఇటీవల వీరి మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయి. గత జనవరిలో తాము విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రతీక్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తన మానసిక ఆరోగ్యం పట్ల అపర్ణ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, కేవలం పేరు ప్రఖ్యాతుల కోసమే ఆమె పాకులాడిందని ఆయన అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ విడాకుల ప్రక్రియ ముందుకు సాగలేదు.
రాజకీయాల పట్ల విముఖత
యాదవ్ కుటుంబంలో దాదాపు అందరూ రాజకీయాల్లో ఉన్నప్పటికీ, ప్రతీక్ మాత్రం ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2012లో కొందరు పార్టీ కార్యకర్తలు ఆయనను అజంగఢ్ నుండి పోటీ చేయించాలని కోరినప్పటికీ, ఆయన ఆసక్తి చూపలేదు. రాజకీయ పదవుల కంటే తన వ్యాపారం , వ్యక్తిగత అభిరుచులకే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతీక్ మరణవార్త తెలుసుకున్న పలువురు నేతలు యాదవ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.




