Narendra Modi: చార్ ధామ్ యాత్రకు వేళాయె.. భక్తులకు ప్రధాని మోదీ మూడు సూచనలు.!
Narendra Modi: ఉత్తరాఖండ్లోని పవిత్ర పుణ్యక్షేత్రాల సందర్శన 'చార్ ధామ్ యాత్ర' ప్రారంభమైన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భక్తులకు ప్రత్యేక సందేశాన్ని అందించారు.
Narendra-Modi
Narendra Modi: ఉత్తరాఖండ్లోని పవిత్ర పుణ్యక్షేత్రాల సందర్శన 'చార్ ధామ్ యాత్ర' ప్రారంభమైన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భక్తులకు ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఈ యాత్ర కేవలం ఆధ్యాత్మిక పర్యటన మాత్రమే కాదని, ఇది మన పర్యావరణం , స్థానిక ఆర్థిక వ్యవస్థ పట్ల మన బాధ్యతను గుర్తుచేసే సందర్భమని ఆయన పేర్కొన్నారు. యాత్రకు సిద్ధమవుతున్న లక్షలాది మంది భక్తులు సురక్షితంగా , బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతూ ప్రధాని మోదీ కొన్ని కీలక సూచనలు చేశారు.
పరిశుభ్రతే పరమావధి..
ప్రధాని మోదీ తన సందేశంలో అత్యంత ప్రాధాన్యతనిచ్చిన అంశం 'పరిశుభ్రత'. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్రాలు అత్యంత సున్నితమైన పర్యావరణాన్ని కలిగి ఉంటాయి. యాత్రికులు తమ వెంట తెచ్చుకునే ప్లాస్టిక్ వస్తువులు లేదా ఇతర వ్యర్థాలను పవిత్ర గంగానది తీరాల్లో కానీ, కొండ ప్రాంతాల్లో కానీ పారవేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. "మనం వెళ్లే ఆధ్యాత్మిక క్షేత్రాలు ఎంత పవిత్రమైనవో, అక్కడి ప్రకృతి కూడా అంతే పవిత్రమైనది" అని పేర్కొంటూ, 'స్వచ్ఛ భారత్' స్ఫూర్తితో దేవభూమిని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
స్థానిక వ్యాపారాలకు చేయూత..
యాత్రికులు తమ ప్రయాణంలో స్థానిక సంస్కృతిని గౌరవించడంతో పాటు, అక్కడి ఆర్థిక వ్యవస్థకు తోడ్పడాలని ప్రధాని సూచించారు. యాత్ర సాగే మార్గాల్లో స్థానిక కళాకారులు తయారుచేసే హస్తకళలు, కుటీర పరిశ్రమల ఉత్పత్తులు , స్థానిక ఆహార పదార్థాలను కొనుగోలు చేయాలని ఆయన భక్తులను కోరారు. దీనివల్ల కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవనోపాధి మెరుగుపడుతుందని, మన దేశపు స్వదేశీ ఉత్పత్తులకు ప్రాచుర్యం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. భక్తులు తమ యాత్రా ఖర్చులో కొంత భాగాన్ని స్థానిక వస్తువుల కొనుగోలుకు కేటాయించాలని ఆయన ప్రత్యేకంగా విన్నవించారు.
భద్రతా నియమాలు.. అధికారుల సూచనలు
హిమాలయాల్లో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించడం కష్టం. అందుకే, యాత్రికులు అధికారుల సూచనలను తూచా తప్పకుండా పాటించాలని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోవడం, వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం , రిజిస్ట్రేషన్ నిబంధనలను అనుసరించడం ఎంతో ముఖ్యమని ఆయన గుర్తుచేశారు. భక్తులందరికీ సురక్షితమైన , సుఖవంతమైన యాత్ర సాగాలని ఆకాంక్షిస్తూ, ఈ యాత్ర ప్రతి ఒక్కరి జీవితంలో నూతన శక్తిని నింపాలని ఆయన ఆశీర్వదించారు.




