PM Modi: పెళ్లి వేడుకలో ప్రధాని సందడి.. అసౌకర్యానికి క్షమాపణలు కోరిన మోదీ
PM Modi: పశ్చిమ బెంగాల్ పర్యటనలో ప్రధాని మోదీ తన పెద్ద మనసును చాటుకున్నారు.
PM Modi: పెళ్లి వేడుకలో ప్రధాని సందడి.. అసౌకర్యానికి క్షమాపణలు కోరిన మోదీ
PM Modi: దేశ ప్రధాని అంటే కట్టుదిట్టమైన భద్రత, ప్రోటోకాల్.. సామాన్యులకు అందనంత ఎత్తులో ఉంటారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం అప్పుడప్పుడు తన సింప్లిసిటీతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా సిలిగురిలో ఆయన చేసిన ఒక పని ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అసలేం జరిగిందంటే..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ సిలిగురిలోని మయ్ఫెయిర్ టీ రిసార్ట్లో బస చేశారు. అదే సమయంలో అక్కడే శ్రేయ, అక్షయ్ అనే యువజంట వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని పర్యటన కావడంతో ఆ ప్రాంతమంతా భద్రతా దళాలు మోహరించాయి. ఈ కట్టుదిట్టమైన సెక్యూరిటీ వల్ల పెళ్లికి వచ్చిన అతిథులకు, వేడుకలకు కొంత అంతరాయం కలిగింది.
నేరుగా వెళ్ళి పలకరించి..
ఈ విషయాన్ని గమనించిన ప్రధాని మోదీ, భద్రతా వలయాన్ని దాటుకుని నేరుగా ఆ కొత్త జంట వద్దకు వెళ్లారు. తన పర్యటన కారణంగా వారికి కలిగిన అసౌకర్యానికి స్వయంగా క్షమాపణలు (Sorry) చెప్పారు. ఊహించని విధంగా దేశ ప్రధాని తమ పక్కన నిలబడి పలకరించడంతో ఆ జంట ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్ అయింది.
ఎన్నికల నేపథ్యంలో..
బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. గత ఎన్నికల్లో (2021) టీఎంసీ 213 సీట్లతో అధికారంలోకి రాగా, బీజేపీ 77 సీట్లతో తన బలాన్ని పెంచుకుంది. ఈసారి హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన ఈ చిన్న ప్రయత్నం స్థానిక ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది.




