PM Modi: 2014కు ముందు ఈ పరిస్థితి వస్తే రైల్వే కుప్పకూలేది.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!

PM Modi: పశ్చిమాసియా చమురు సంక్షోభం వేళ హరియాణాలోని జింద్‌లో దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

Arun Chilukuri
Published on: 17 July 2026 4:37 PM IST
PM Modi
X

PM Modi: 2014కు ముందు ఈ పరిస్థితి వస్తే రైల్వే కుప్పకూలేది.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!

PM Modi: పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య భీకర యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు (Crude Oil) ధరలు భగ్గుమంటున్న తరుణంలో భారత్ ఇంధన స్వాలంబన దిశగా ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. హరియాణాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో దేశంలోనే మొట్టమొదటిసారిగా పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో (Make in India) రూపొందించిన హైడ్రోజన్ రైలును (Hydrogen Train) ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు.

రైలు ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత రైల్వే సాంకేతిక పరిణామాన్ని వివరించారు. "మనం రైల్వేల చరిత్రను పరిశీలిస్తే.. 19వ శతాబ్దంలో రైళ్లు ఆవిరియంత్రం (Steam Engine) ఆధారంగా నడిచేవి. 20వ శతాబ్దంలో డీజిల్, విద్యుత్ శక్తి ఇంధనంగా మారాయి. ఇప్పుడు 21వ శతాబ్దపు భారత రైల్వే సరికొత్త మైలురాయిని అందుకుంటూ పర్యావరణ హితమైన హైడ్రోజన్ శక్తితో నడుస్తోంది" అని మోదీ గర్వంగా ప్రకటించారు.

ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ దాడుల వల్ల హర్మూజ్ జలసంధిలో చమురు నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. చమురు దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడే భారత్‌పై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ.. గత ప్రభుత్వాల తీరుపై విమర్శలు గుప్పించారు.

"ప్రస్తుత గల్ఫ్ సంక్షోభాన్ని మన ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. ఒకవేళ 2014కు ముందే ఇటువంటి అంతర్జాతీయ సంక్షోభం వచ్చి ఉంటే, దేశ రైల్వే వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి ఉండేది. ఎందుకంటే అప్పట్లో చాలా వరకు రైళ్లు డీజిల్‌పైనే ఆధారపడి నడిచేవి. కానీ ఇప్పుడు మన రైల్వే రంగాన్ని ఆధునీకరించి విద్యుదీకరణ, గ్రీన్ ఎనర్జీ వైపు విజయవంతంగా మళ్లించాం" అని స్పష్టం చేశారు.

ఇదే వేదికపై నుంచి దేశ క్రీడా రంగం గురించి ప్రధాని మోదీ ఒక భారీ ప్రకటన చేశారు. భారతదేశంలో ఒలింపిక్ క్రీడలను నిర్వహించేందుకు తమ ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని వెల్లడించారు. వచ్చే 2036లో ఒలింపిక్ క్రీడలను భారత్‌లో నిర్వహించాలనే బలమైన ఆకాంక్షను ఆయన వ్యక్తంచేశారు. ఒలింపిక్స్‌కు ముందే, 2030లో కామన్‌వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు దేశం సిద్ధమవుతోందని చెప్పారు. ఈ మెగా క్రీడల నిర్వహణ కోసం దేశంలోని అథ్లెట్లకు, క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story