President Murmu: చంద్రబాబు ఒక విజనరీ లీడర్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
President Murmu: ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత లభించడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
President Murmu
President Murmu: ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత లభించడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చారిత్రక నిర్ణయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజముద్ర వేయడం పట్ల ధన్యవాదాలు తెలిపేందుకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలోని ఎంపీల బృందం సోమవారం ఢిల్లీలో ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకుంది.
ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిన వేళ
రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేక ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న ఇబ్బందులను మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా రాష్ట్రపతికి వివరించారు. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల స్వప్నం ఇప్పుడు వాస్తవరూపం దాల్చిందని, అమరావతికి చట్టబద్ధత కల్పించడం ద్వారా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడారని వారు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే రాజధాని శంకుస్థాపన జరిగిందని, 2024లో ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత పనులు వేగవంతం అయ్యాయని గుర్తుచేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్ , పర్యావరణ హిత నిర్మాణాల ప్రత్యేకతలతో కూడిన పుస్తకాన్ని కూడా ఈ సందర్భంగా రాష్ట్రపతికి అందజేశారు.
రైతుల అలుపెరుగని పోరాటం
రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను లోకేశ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేవలం 58 రోజుల్లోనే 34 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా అందించిన రైతుల గొప్పతనాన్ని కొనియాడారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో వేధింపులు, అక్రమ కేసులు ఎదుర్కొన్నప్పటికీ, మహిళలు, వృద్ధులు సైతం వెనకడుగు వేయకుండా శాంతియుతంగా ఉద్యమం కొనసాగించారని వివరించారు. ఈ భూసేకరణ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద భూసేకరణగా చరిత్రలో నిలిచిపోతుందని వారు తెలిపారు.
రాష్ట్రపతి ప్రశంసలు… ఆకాంక్ష
మంత్రి, ఎంపీల బృందం చెప్పిన విషయాలను సావధానంగా విన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమరావతికి సంబంధించిన చట్టం తన హయాంలో రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. "పోరాడి సాధించుకున్న విజయాలు ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోతాయి" అని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ నాయకుడని, ఆయన దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆమె ఆకాంక్షించారు. రాజధాని నిర్మాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆమె మనస్ఫూర్తిగా కోరుకున్నారు.




