Anti Paper Leak Bill: లోక్సభలో ‘యాంటీ పేపర్ లీక్’ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం!
Anti Paper Leak Bill: పేపర్ లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలు. లోక్సభలో 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026' ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి జితేంద్ర సింగ్.
Anti Paper Leak Bill: లోక్సభలో ‘యాంటీ పేపర్ లీక్’ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం!
Anti Paper Leak Bill: దేశవ్యాప్తంగా కలకలం రేపిన ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. పేపర్ లీకులకు పాల్పడే వారిని, ఆర్గనైజ్డ్ ముఠాలను కఠినంగా శిక్షించే దిశగా రూపకల్పన చేసిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు, 2026’ (Anti-Paper Leak Bill) ను సోమవారం లోక్సభ ముందుకు తీసుకువచ్చింది.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం మేరకు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సోమవారం ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. పరీక్షల లీకేజీల వివాదం మరియు ఇతర అంశాలపై విపక్ష సభ్యులు సభలో ఆందోళన కొనసాగిస్తున్న సమయంలోనే ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. నిరసనలు, నినాదాల హోరు పెరగడంతో స్పీకర్ లోక్సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
దేశవ్యాప్తంగా నీట్ (NEET) సహా అనేక పోటీ పరీక్షల పేపర్లు లీక్ అవ్వడం, సీబీఎస్ఈ మూల్యాంకనంలో లోపాలు వెలుగుచూడటంతో విద్యార్థులు, యువజన సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. విద్యార్థుల ఆగ్రహం, రాజకీయ ఒత్తిడి పెరగడంతో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవలే తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో పరీక్షా వ్యవస్థపై విద్యార్థుల్లో మళ్లీ నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు కేంద్రం అత్యంత వేగంగా ఈ చట్టాన్ని సవరించేందుకు చర్యలు తీసుకుంటోంది.




