Rahul Gandhi: లోక్‌సభలో రాహుల్ గాంధీ వర్సెస్ బిజెపి: సభను ఊపేసిన 'పేపర్ లీక్' బిల్లు చర్చ!

Rahul Gandhi: లోక్‌సభలో పేపర్ లీక్ వ్యతిరేక బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

Arun Chilukuri
Published on: 29 July 2026 2:30 PM IST
Rahul Gandhi
X

Rahul Gandhi: లోక్‌సభలో రాహుల్ గాంధీ వర్సెస్ బిజెపి: సభను ఊపేసిన 'పేపర్ లీక్' బిల్లు చర్చ!

Rahul Gandhi: పార్లమెంట్ లోక్‌సభ వేదికగా విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. పబ్లిక్ ఎగ్జామినేషన్లలో అక్రమాల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం సవరణలతో ప్రవేశపెట్టిన 'యాంటీ పేపర్ లీక్ బిల్లు'పై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంలో రాహుల్ గాంధీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో రాహుల్ ఉపయోగించిన ఒక నిర్దిష్ట పదం, ఆర్‌ఎస్‌ఎస్ (RSS) మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను లక్ష్యంగా చేసుకుని చేసిన ఆరోపణలపై బిజెపి ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

విద్యార్థుల ఆందోళనలను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. "దేశవ్యాప్తంగా పరీక్షల పేపర్ లీకేజీలతో విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఢిల్లీలో శాంతియుత నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు రెచ్చగొట్టారు. నేను ఆందోళన బాట పట్టిన విద్యార్థులతో మాట్లాడాను. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు తమ ఆవేదనను పట్టించుకోవడం లేదని, 'మూర్ఖులు ఎవరి మాటలు వినరు' అని విద్యార్థులు నాతో చెప్పారు" అని వ్యాఖ్యానించారు.

రాహుల్ "మూర్ఖులు" అనే పదాన్ని ప్రస్తావించడంపై బిజెపి ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పేరు చెప్పి అధికార పక్ష ఎంపీలను, ప్రభుత్వాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. సభకు మర్యాద లేని ఈ అభ్యంతరకర వ్యాఖ్యలను వెంటనే పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై సభలో తీవ్ర వాగ్వాదం జరగడంతో స్పీకర్ ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

విద్యారంగంలో జరుగుతున్న మార్పులపై ఆరోపణలు గుప్పిస్తూ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. చదువు నేడు సామాన్యుడికి అందుబాటులో లేని ఖరీదైన వ్యాపారంగా మారిందని, విద్యార్థుల తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేవలం నామ్‌కేవాస్తే అని, మొత్తం విద్యా వ్యవస్థను నడిపిస్తోంది ఆర్‌ఎస్‌ఎస్ (RSS) సంస్థేనని ఆరోపించారు. దేశంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులుగా (VCs) ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం ఉన్నవారినే నియమిస్తూ వ్యవస్థలను దెబ్బతీస్తున్నారని, విద్యార్థులకు అసలైన శత్రువు ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థేనని రాహుల్ మండిపడ్డారు.

విద్యార్థుల ఆందోళనపై పోలీసుల బలప్రయోగాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. నిరసనకారులను అణచివేయడానికి పెల్లెట్ గన్స్ ఉపయోగించాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు ఇచ్చారని, లోక్‌సభ చర్చకు రావడానికి హోంమంత్రికి ధైర్యం సరిపోవడం లేదని విమర్శించారు.

"బాధ్యతారాహిత్యంగా హోంమంత్రిపై ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణలు ఎలా చేస్తారు? అమిత్ షా పేరు ప్రస్తావించడానికి రాహుల్ గాంధీ వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి? రాహుల్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని హోంమంత్రికి మరియు సభకు క్షమాపణలు చెప్పాలి" అని రిజిజు గట్టిగా డిమాండ్ చేశారు. హోంమంత్రిపై చేసిన ఆరోపణలతో సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య నినాదాలు, గందరగోళం చెలరేగడంతో లోక్‌సభలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story