Rahul Gandhi: దేశంలో మునుపెన్నడూ చూడని ఆర్థిక సంక్షోభం రాబోతోంది

Rahul Gandhi: దేశ ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్ముందు దేశం మునుపెన్నడూ చూడని తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందని రాయ్‌బరేలీ వేదికగా హెచ్చరించారు.

Arun Chilukuri
Published on: 19 May 2026 3:48 PM IST
Rahul Gandhi
X

Rahul Gandhi: దేశంలో మునుపెన్నడూ చూడని ఆర్థిక సంక్షోభం రాబోతోంది

Rahul Gandhi: దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన వ్యాఖ్యలు చేశారు. మున్ముందు దేశానికి చాలా కష్టకాలం రాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. గతంలో ఎన్నడూ, చాలా సంవత్సరాలుగా దేశం చూడనటువంటి భారీ ఆర్థిక సంక్షోభం (Economic Crisis) ముంచుకొస్తోందని హెచ్చరించారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం తన సొంత నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చేరుకున్న రాహుల్ గాంధీ.. అక్కడ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక స్థితిగతులు, కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.

ఈ రాబోయే ఆర్థిక సంక్షోభం దేశంలోని కార్పొరేట్ దిగ్గజాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని రాహుల్ గాంధీ ఆరోపించారు. "రాబోయే సంక్షోభం వల్ల అదానీ, అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తలకు వచ్చే నష్టం ఏమీ లేదు, వారిపై ఇది ఎటువంటి ప్రభావం చూపదు." అని రాహుల్ అన్నారు. కానీ, దేశ భవిష్యత్తు అయిన యువత, దేశానికి వెన్నెముక లాంటి రైతులు, క్షేత్రస్థాయిలోని చిన్న వ్యాపారులపైనే ఈ సంక్షోభం తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఉపాధి అవకాశాలు, వ్యాపారాలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉందనే సంకేతాలు ఇచ్చారు.

ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు చర్యల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. "ప్రజలందరికీ పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిస్తున్నారు. కానీ, ఆ సూత్రాలను ఆయన మాత్రం అస్సలు పాటించడం లేదు. దేశ ప్రజలను విదేశాలకు వెళ్లవద్దని, ఇక్కడే ఖర్చు చేయాలని చెబుతూ.. ఆయన మాత్రం నిరంతరం ప్రపంచ పర్యటనలు (Foreign Trips) చేస్తూ గడుపుతున్నారు." అని రాహుల్ ఎద్దేవా చేశారు.

రాయ్‌బరేలీ పర్యటనలో భాగంగా నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ.. స్థానిక సమస్యలపై చర్చిస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ దేశవ్యాప్త ఆర్థిక అంశాన్ని తెరపైకి తీసుకురావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story