పార్సిల్ ఇచ్చిన కాసేపటికే.. మహిళకు ‘ఐ లవ్ యూ’ అంటూ ర్యాపిడో రైడర్ వేధింపులు!
Noida: నోయిడాలో పార్సిల్ డెలివరీ చేసిన ర్యాపిడో రైడర్ మహిళకు ‘ఐ లవ్ యూ’ అంటూ అసభ్యకర మెసేజ్లు పంపి వేధించిన ఘటన వైరల్ అయింది.
పార్సిల్ ఇచ్చిన కాసేపటికే.. మహిళకు ‘ఐ లవ్ యూ’ అంటూ ర్యాపిడో రైడర్ వేధింపులు!
Noida: నోయిడాలో మహిళా భద్రతకు మరోసారి ప్రశ్నార్థకం ఎదురైంది. పార్సిల్ డెలివరీ చేయడానికి వచ్చిన ఓ ర్యాపిడో రైడర్.. ఆ తర్వాత ఆ మహిళకు అసభ్యకరమైన మెసేజ్లు పంపి తీవ్ర వేధింపులకు గురిచేసిన ఘటన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన ఓ మహిళకు ర్యాపిడో ద్వారా పార్సిల్ అందింది. అయితే డెలివరీ ముగిసిన కొద్దిసేపటికే ఆ రైడర్ ఆమె వ్యక్తిగత నంబర్కు ‘హలో.. ఎలా ఉన్నారు?’ అంటూ మెసేజ్ చేశాడు. ఆ వెంటనే ఏమాత్రం సంకోచించకుండా ‘ఐ లవ్ యూ’ అంటూ మరో సందేశం పంపాడు. ఈ అనూహ్య పరిణామానికి తీవ్ర అసౌకర్యానికి గురైన ఆ మహిళ.. తనకు ఇలాంటి మెసేజ్లు పెట్టవద్దని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది.
అయినప్పటికీ ఆ రైడర్ లో ఏమాత్రం భయం కనిపించలేదు. సరికదా మరింత దురుసుగా స్పందిస్తూ.. ‘ఎక్కడైనా ఫిర్యాదు చేసుకో.. రాపిడోలో చేయి’ అంటూ ఎగతాళిగా బదులిచ్చాడు. ఈ మొత్తం సంభాషణకు సంబంధించిన వాట్సాప్ స్క్రీన్షాట్లను సదరు బాధితురాలు ప్రముఖ సోషల్ మీడియా వేదిక అయిన లింక్డ్ఇన్లో షేర్ చేశారు. డెలివరీ యాప్లలో పనిచేసే రైడర్ల నేపథ్య తనిఖీ, మహిళా ప్రయాణికులు వినియోగదారుల భద్రతపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ర్యాపిడో సంస్థ స్పందించింది. బాధితురాలికి క్షమాపణలు చెబుతూ.. వినియోగదారుల భద్రత, గౌరవం తమకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొంది. అయితే, ఆ కాంటాక్ట్ రైడర్పై కంపెనీ ఎలాంటి కఠిన చర్యలు తీసుకుందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. మహిళల భద్రతతో చెలగాటమాడుతున్న ఇలాంటి వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.




