Shocking Incident in UP: యూపీలో దారుణం.. స్టూడెంట్‌ను మందలించిందని క్లాస్‌రూమ్‌లోనే టీచర్‌పై దాడి చేసిన పేరెంట్స్!

Shocking Incident in UP: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది. పాఠాలు సరిగ్గా వినలేదని, తప్పు చేశాడని మందలించిన ఉపాధ్యాయురాలపై విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్‌లోనే దాడి చేసిన షాకింగ్ ఘటన వివరాలు.

Arun Chilukuri
Published on: 31 Aug 2026 7:59 AM IST
Shocking Incident in UP
X

Shocking Incident in UP: యూపీలో దారుణం.. స్టూడెంట్‌ను మందలించిందని క్లాస్‌రూమ్‌లోనే టీచర్‌పై దాడి చేసిన పేరెంట్స్!

Shocking Incident in UP: ప్రస్తుత కాలంలో కొందరు తల్లిదండ్రుల ప్రవర్తన హద్దుమీరుతోంది. స్కూళ్లలో విద్యార్థులు చదవకపోయినా, తప్పులు చేసినా ఉపాధ్యాయులు క్రమశిక్షణలో పెట్టేందుకు మందలించడం లేదా చిన్నపాటి శిక్షలు ఇవ్వడం అనాదిగా వస్తున్న పద్ధతే. అయితే, ఏం జరిగిందనే కనీస సమాచారం కూడా తెలుసుకోకుండా.. తమ పిల్లలను ఎలా మందలిస్తారంటూ కొందరు నేరుగా పాఠశాలలకు వచ్చి యాజమాన్యాలతో గొడవలకు దిగుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే ఒకరు వెలుగుచూడగా, ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

"తప్పు చేసిన విద్యార్థిని మందలించిన ఉపాధ్యాయురాలపై పాఠశాల గదిలోనే తల్లిదండ్రులు భౌతిక దాడికి దిగి నానా బీభత్సం సృష్టించారు."

ఉత్తరప్రదేశ్‌ లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లా, దెల్హుపూర్‌ ప్రాంతంలో ఉన్న 'పార్వతి గ్లోబల్ సైన్స్ స్కూల్' లో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో త్రివిక్ మిశ్రా అనే విద్యార్థి ఒక కుందేలును చంపిన ఘటనలో ఉపాధ్యాయురాలు పాలక్ మిశ్రా అతన్ని తీవ్రంగా మందలించారు. ఈ విషయాన్ని విద్యార్థి తన ఇంటికి వెళ్లి చెప్పడంతో, ఆగ్రహించిన అతని కుటుంబ సభ్యులు పాఠశాలకు పరిగెత్తుకుంటూ వచ్చారు.

సౌమ్య మిశ్రా, అభిషేక్ మిశ్రా అనే వ్యక్తులు క్లాస్‌రూమ్‌లో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయురాలు పాలక్ మిశ్రాపైకి దూసుకెళ్లారు. "మా కొడుకునే మందలిస్తావా" అంటూ ఆమెపై దాడి చేసి, కిందపడేసి కొట్టడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. తోటి సిబ్బంది జోక్యంతో ఆ ఉపాధ్యాయురాలు ప్రాణాలతో బయటపడింది.

ఈ ఘటనపై బాధితురాలు పాలక్ మిశ్రా నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితులపై ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సౌమ్య మిశ్రా, అభిషేక్ మిశ్రాలను అరెస్ట్ చేశారు. స్కూల్‌లోకి వెళ్లి మరీ టీచర్‌పై దాడికి పాల్పడిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఉపాధ్యాయులకు రక్షణ కరవవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story