Omar Abdullah: జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా దంపతులకు విడాకులు మంజూరు చేసిన సుప్రీంకోర్టు!
Omar Abdullah: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పాయల్ దంపతులకు విడాకులు మంజూరు చేసిన సుప్రీంకోర్టు. 31 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు.
Omar Abdullah: జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా దంపతులకు విడాకులు మంజూరు చేసిన సుప్రీంకోర్టు!
Omar Abdullah: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ అబ్దుల్లా మధ్య సుదీర్ఘకాలంగా నడుస్తున్న వైవాహిక వివాదానికి తెరపడింది. తమ వివాహ బంధాన్ని పరస్పర అంగీకారంతో రద్దు చేసుకునేందుకు ఇరుపక్షాలు అంగీకరించడంతో, సర్వోన్నత న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు చేసింది.
ఒమర్ అబ్దుల్లా, పాయల్ 1994లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే తీవ్ర విభేదాల కారణంగా 2011లో ఒమర్ తన భార్య నుంచి విడిపోతున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. నాటి నుంచి వారిద్దరూ విడివిడిగానే జీవిస్తున్నారు. భార్యతో విడాకులు ఇప్పించాలని కోరుతూ 2016లో ఒమర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా, అక్కడ పిటిషన్ తిరస్కరణకు గురైంది.
ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ 2023లో దిల్లీ హైకోర్టుకు వెళ్లగా, దిగువ కోర్టు ఉత్తర్వులనే హైకోర్టు సమర్థించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఇరువర్గాలు మధ్యవర్తిత్వానికి అంగీకరించి, పెండింగ్లో ఉన్న అన్ని కేసులను ఉపసంహరించుకోవడానికి సిద్ధమయ్యాయి.
ఇరువర్గాలు పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకోవడంతో, రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 (Article 142) కింద లభించే విశేషాధికారాన్ని ఉపయోగించి విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ఉమ్మడి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఆలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీరి 31 ఏళ్ల బంధానికి అధికారికంగా ముగింపు లభించింది.




