Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి.. రేపే ప్రమాణ స్వీకారం!
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. అమిత్ షా సమక్షంలో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మే 9న ప్రధాని మోదీ సమక్షంలో సువేందు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి.. రేపే ప్రమాణ స్వీకారం!
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కోల్కతాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో సువేందు అధికారిని ఏకగ్రీవంగా నేతగా ఎన్నుకున్నారు. అనంతరం బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రి సువేందు అని అమిత్ షా అధికారికంగా ప్రకటించారు.
నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం మే 9న (శనివారం) జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.
సువేందు అధికారి రాజకీయ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆయన నేపథ్యం మరియు విజయాలు ఇవే.. 1970లో జన్మించిన సువేందు, తన తండ్రి సిసిర్ అధికారి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చారు. 1995లో తొలిసారి కౌన్సిలర్గా గెలిచి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2007లో వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నందిగ్రామ్ భూపోరాటంలో సువేందు కీలక పాత్ర పోషించారు. మమతా బెనర్జీని అధికారంలోకి తీసుకురావడంలో ఈ ఉద్యమమే ప్రధాన భూమిక పోషించింది.
తృణమూల్లో మమత తర్వాత అత్యంత శక్తివంతమైన నేతగా ఎదిగిన సువేందు, అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత పెరగడంతో పార్టీని వీడారు. 2020లో బీజేపీలో చేరి, 2021లో నందిగ్రామ్లో మమతా బెనర్జీని ఓడించి 'జైంట్ కిల్లర్'గా పేరు తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీని ఆమె సొంత నియోజకవర్గం భవానీపూర్లో మరోసారి ఓడించడం ద్వారా తన సత్తా చాటారు.
సుదీర్ఘ కాలం బెంగాల్ను పాలించిన మమతా బెనర్జీ పతనం తర్వాత, సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ తొలిసారి బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. బెంగాల్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా బీజేపీ నేతలు ప్రకటించారు.




