Tamil Nadu Budget 2026: విజయ్ సర్కార్ తొలి బడ్జెట్.. వధువులకు బంగారం, విద్యార్థులకు ఉచిత లాప్టాప్లు!
Tamil Nadu Budget 2026: తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ తొలి బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి మేరీ విల్సన్.
Tamil Nadu Budget 2026: విజయ్ సర్కార్ తొలి బడ్జెట్.. వధువులకు బంగారం, విద్యార్థులకు ఉచిత లాప్టాప్లు!
Tamil Nadu Budget 2026: తమిళనాడులో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వం తన తొలి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను శాసనసభకు సమర్పించారు. పేదరిక నిర్మూలన, పారదర్శక పాలన మరియు మత్తుపదార్థాలు లేని సమాజ నిర్మాణం లక్ష్యంగా ఈ బడ్జెట్ను రూపొందించినట్లు మంత్రి పేర్కొన్నారు. 2035-36 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1.5 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు.
ప్రధాన బడ్జెట్ కేటాయింపులు & సంక్షేమ పథకాలు:
ఉచిత విద్యుత్: గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించారు.
అన్నన్ సీర్ తిట్టమ్: ఎన్నికల హామీ మేరకు వధువుకు 8 గ్రాముల బంగారం నాణెం, పట్టు చీర కానుకగా అందించే పథకానికి ₹812 కోట్లు కేటాయించారు.
నవజాత శిశువులకు బంగారు ఉంగరం: ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే పిల్లలకు 1 గ్రాము బంగారు ఉంగరాన్ని అందించేందుకు ₹560 కోట్లు కేటాయించారు.
వెట్రి లాప్టాప్ పథకం: కళాశాల విద్యార్థుల డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు ₹2,000 కోట్లు కేటాయించారు.
ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు: వచ్చే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 20,000 బహిరంగ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ₹50 కోట్లు, నివాస ప్రాంతాలలో ఛార్జింగ్ పాయింట్ల ప్రోత్సాహకాలకు ₹5 కోట్లు ప్రతిపాదించారు.
విద్యా రంగానికి ప్రాధాన్యత:
ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు ₹300 కోట్లు.
10,000 పాఠశాలల్లో పరిశుభ్రత, తాగునీరు, భద్రత కల్పించే ‘సూపర్ క్లీన్, సూపర్ క్యాంపస్’ పథకం అమలు.
టీఎన్ స్పార్క్ పథకాన్ని అదనంగా 2,600 పాఠశాలలకు విస్తరణ.
ఉపాధి & నైపుణ్యాభివృద్ధి: 'వెట్రితిరన్ శిక్షణ పథకం' కింద లక్ష మంది ఉద్యోగార్థులకు ఉపాధి నైపుణ్య శిక్షణ, స్టైఫండ్ అందించడానికి ₹150 కోట్లు కేటాయించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాలసీ: పాఠశాల విద్యార్థులకు AI, రోబోటిక్స్ విద్యను అందించడంతో పాటు కొత్త AI విధానం కోసం ₹2,000 కోట్లు ప్రకటించారు.
ఆరోగ్య రంగం: ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు ₹23,353 కోట్లు కేటాయించారు.
రవాణా & చెన్నై మాస్టర్ ప్లాన్: రవాణా శాఖకు ₹13,561 కోట్లు కేటాయించగా, హోసూరు వరకు మెట్రో విస్తరణపై కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అలాగే చెన్నై అభివృద్ధి కోసం ₹25 కోట్లతో గ్లోబల్ ప్రమాణాలతో కూడిన కొత్త 'మాస్టర్ ప్లాన్' ప్రకటించారు.
మన్నిన్ మగల్ పథకం: ఆదిద్రావిడ, గిరిజన వ్యవసాయ కూలీలను భూమి యజమానులుగా మార్చేందుకు ఆర్థిక సాయం, ఆధునిక సాగు పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
కాగా, రేపు (ఆగస్టు 6) రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. డిఎమ్కె నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అరెస్టు, అనంతరం మద్రాస్ హైకోర్టు జోక్యంతో ఆయన విడుదలైన నేపథ్యంలో చోటుచేసుకున్న ఉద్రిక్త రాజకీయ పరిస్థితుల నడుమ ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి.




