Tamil Nadu: నేరగాళ్లపై ఉక్కుపాదం మోపండి.. కేసుల నమోదులో ఆలస్యం వద్దు: పోలీసులకు సీఎం విజయ్ కఠిన ఆదేశాలు!

Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రి ఎస్. జోసెఫ్ విజయ్ రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

Arun Chilukuri
Published on: 25 May 2026 2:37 PM IST
Tamil Nadu
X

Tamil Nadu: నేరగాళ్లపై ఉక్కుపాదం మోపండి.. కేసుల నమోదులో ఆలస్యం వద్దు: పోలీసులకు సీఎం విజయ్ కఠిన ఆదేశాలు!

Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా నూతన ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని, ముఖ్యంగా మహిళలు, చిన్నారుల రక్షణ విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని తమిళనాడు ముఖ్యమంత్రి ఎస్. జోసెఫ్ విజయ్ పోలీసు అధికారులను గట్టిగా ఆదేశించారు. బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే కేసులను తక్షణమే నమోదు చేసి, దర్యాప్తును వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. నేడు రాష్ట్ర సచివాలయంలో (సెక్రటేరియట్) శాంతిభద్రతలపై ఆయన తొలిసారిగా ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ కీలక సమావేశంలో సీఎం విజయ్ మాట్లాడుతూ.. లైంగిక నేరాలకు సంబంధించిన కేసుల విచారణలో ఎలాంటి జాప్యం జరగకూడదని పోలీసు బాస్ లకు స్పష్టం చేశారు. చట్టపరమైన ప్రక్రియలను పక్కాగా అనుసరిస్తూ, కోర్టుల్లో నిందితులకు అత్యంత కఠిన శిక్షలు పడేలా బలమైన ఆధారాలు సేకరించాలని సూచించారు.

"బాధితులకు సకాలంలో న్యాయం జరిగి, నేరగాళ్లకు కఠిన శిక్షలు పడితేనే.. భవిష్యత్తులో ఇలాంటి ఘోరమైన నేరాలు చేయడానికి ఇతరులు భయపడతారు. చట్టం పట్ల నేరస్థుల్లో వణుకు పుట్టాలి" అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల విచారణలో ఎలాంటి అలసత్వం వహించకుండా దర్యాప్తు సంస్థలు, అటు న్యాయశాఖ, ఇటు సంబంధిత ప్రభుత్వ విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు. కేవలం శిక్షలు వేయడమే కాకుండా, సమాజంలో నేరాల నివారణకు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం కూడా చాలా ముఖ్యమని ఆయన నొక్కిచెప్పారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు, మహిళల భద్రతపై ప్రజా స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నిర్వహించిన ఈ అత్యున్నత స్థాయి సమీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) డాక్టర్ ఎం. సాయికుమార్, హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. మణివాసన్, అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్, రాష్ట్ర డీజీపీ (DGP) డాక్టర్ సందీప్ రాయ్ రాథోడ్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో తమిళనాడు పోలీసులు ఇకపై మరింత వేగంగా, పారదర్శకంగా రెస్పాండ్ కానున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story