Tamil Nadu CM Vijay: సీఎం విజయ్ సంచలన ప్రకటన.. సమాచారం ఇస్తే రూ. లక్ష రివార్డు!
Tamil Nadu CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దళపతి (TVK Vijay) అవినీతిపై ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగే అధికారులను పట్టిస్తే రూ. 1 లక్ష రివార్డ్ ఇస్తామని సంచలన ప్రకటన చేశారు.
Tamil Nadu CM Vijay: సీఎం విజయ్ సంచలన ప్రకటన.. సమాచారం ఇస్తే రూ. లక్ష రివార్డు!
CM Vijay Thalapathy: తమిళనాడు రాజకీయాలు ఈ వేసవిలో మరింత హీట్ పుట్టిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ‘దళపతి’ విజయ్.. ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా మెరుపు వేగంతో ముందుకు సాగుతున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ప్రభుత్వ నిధులను ఎక్కడా వృథా కానివ్వబోమని ప్రకటించిన విజయ్.. తాజాగా రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు అత్యంత కీలకమైన, సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు.
తమిళనాడులో లంచాలు తీసుకోవడం, ఇవ్వడంపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని టీవీకే (TVK) సర్కార్ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా.. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్ చేసే అధికారుల వివరాలను వీడియో లేదా ఆడియో ఆధారాలతో సహా పట్టిస్తే, అలా ఫిర్యాదు చేసిన వారికి రూ. 1 లక్ష రివార్డ్ ఇస్తామని సీఎం విజయ్ సర్కార్ ప్రకటించింది. రాష్ట్రంలో అవినీతిపై పోరాటంలో ఈ పథకం ఒక గేమ్ ఛేంజర్గా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రభుత్వ అధికారులు కనీసం వెయ్యి రూపాయలు లంచం డిమాండ్ చేసినా సరే.. బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని విజయ్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. వచ్చిన ఫిర్యాదులపై అవినీతి నిరోధక శాఖ (ACB) తక్షణమే విచారణ జరుపుతుంది. విచారణలో నిజనిజాలు తేలి, సదరు అధికారి తప్పు చేసినట్లు రుజువైతే.. సమాచారం అందించిన వ్యక్తికి వెంటనే ప్రభుత్వం తరఫున రూ. లక్ష నగదు బహుమతిని అందజేస్తారు. తమిళనాడులో పూర్తి పారదర్శకమైన పాలన అందించడమే కాకుండా, ప్రభుత్వ పథకాల లబ్ధి నేరుగా ప్రజలకు చేరేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
అవినీతిపై సీఎం విజయ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై తమిళనాడు వ్యాప్తంగా సామాన్య ప్రజల నుంచి భారీ ఎత్తున పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే, విజయ్ పాలనకు వస్తున్న ప్రజాదరణను ప్రతిపక్ష డీఎంకే (DMK) తట్టుకోలేకపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇటీవల డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు క్యాడర్తో మాట్లాడుతూ.. "మరో ఆరు నెలల్లో సీఎం విజయ్ ప్రభుత్వం కూలిపోవడం పక్కా, అందరూ ఎన్నికలకు సిద్ధం కావాలి" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే నేతలు ప్రభుత్వంపై ఇలాంటి కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలకు తమిళ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.




