Fire Accident : ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం.. ఐసీయూలో 10 మంది రోగులు సజీవ దహనం
Fire Accident : ఒడిశాలోని కటక్ ఎస్సీబీ ఆసుపత్రి ఐసీయూలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది రోగులు మృతి చెందగా, సీఎం రూ.25 లక్షల పరిహారం ప్రకటించి విచారణకు ఆదేశించారు.
SCB Medical College Fire
Fire Accident : ఒడిశా రాష్ట్రంలోని కటక్లో గల ప్రముఖ ఎస్సీబీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో (SCB Medical College) సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలోని ట్రామా కేర్ ఐసీయూలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు పది మంది నిస్సహాయులైన రోగుల ప్రాణాలను బలితీసుకున్నాయి. ఐసీయూలో అకస్మాత్తుగా మంటలు రావడంతో వార్డంతా దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో ప్రాణభయంతో రోగులు, వారి బంధువులు అటూ ఇటూ పరుగులు తీయడంతో ఆసుపత్రి ప్రాంగణమంతా యుద్ధ భూమిని తలపించింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.
ఈ విషాద ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన రోగుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున భారీ నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించిన సీఎం.. ఒకవేళ ఆసుపత్రి యాజమాన్యం లేదా సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఘటన జరిగిన వెంటనే సోమవారం ఉదయం ముఖ్యమంత్రి స్వయంగా కటక్ చేరుకుని ఆసుపత్రిని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, అక్కడ ఉన్న భద్రతా ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న మిగిలిన రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. రోగుల భద్రత విషయంలో రాజీ పడవద్దని, ఇతర విభాగాల్లో కూడా అగ్నిమాపక భద్రతను తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు.
#WATCH | Odisha: A fire broke out at Trauma Care ICU of S.C.B. Medical College and Hospital in Cuttack. Fire brigade present at the spot for firefighting operations. Visuals from the spot. More details awaited. pic.twitter.com/KZVF5wOy4V
— ANI (@ANI) March 16, 2026
మంటలు చెలరేగిన సమయంలో రోగులను కాపాడేందుకు ఆసుపత్రి సిబ్బంది సాహసోపేతంగా వ్యవహరించారు. ఈ క్రమంలో 11 మంది ఆసుపత్రి ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. పొగ వల్ల ఊపిరాడక, మంటల వల్ల ఒళ్లు కాలిపోయిన వీరిని వెంటనే అత్యవసర విభాగంలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ఐసీయూలో ఉన్న మరికొంతమందిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. లేదంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉండేదని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, ఆసుపత్రి పరిసరాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు సరిగ్గా ఉన్నాయా లేదా? ఐసీయూలో మంటలను ఆర్పే పరికరాలు పని చేస్తున్నాయా? అనే కోణంలో ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతా ఏర్పాట్లపై మరోసారి చర్చ మొదలైంది.




