Vijay: మంచే జరుగుతుంది.. విజయం ఖాయం.. ఉత్కంఠ రేపుతున్న 'దళపతి' వ్యాఖ్యలు!
Vijay: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న వేళ, 12వ తరగతి ఫలితాలపై నటుడు, టీవీకే అధినేత విజయ్ స్పందించారు. విజయం సాధించిన వారికి అభినందనలు తెలుపుతూనే, ఫెయిల్ అయిన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు.
Vijay: మంచే జరుగుతుంది.. విజయం ఖాయం.. ఉత్కంఠ రేపుతున్న 'దళపతి' వ్యాఖ్యలు!
Vijay: తమిళనాట రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్ అందుకోలేక ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్ (Thalapathy Vijay) వ్యూహరచన చేస్తున్నారు. ఈ ఉత్కంఠభరిత పరిస్థితుల మధ్య విజయ్ తాజాగా వెలువడిన తమిళనాడు 12వ తరగతి ఫలితాలపై స్పందించారు. విజయం సాధించిన విద్యార్థులను అభినందిస్తూ ఆయన సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టారు.
తన పోస్ట్లో విద్యార్థులకు ధైర్యం చెబుతూ విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. "పట్టుదలతో చదివి విజయం సాధించిన విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ కఠోర శ్రమకు లభించిన గుర్తింపు ఈ విజయం. ఉన్నత విద్యలో మీరు మరిన్ని శిఖరాలను అధిరోహించాలి." "పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు అస్సలు నిరాశ చెందవద్దు. మనం విజయపు అంచున ఉన్నామని గుర్తుంచుకోండి. మళ్ళీ ప్రయత్నిస్తే ఈసారి విజయం ఖాయం" అని ఆత్మవిశ్వాసం నింపారు.
ఒకవైపు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం కోసం విజయ్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటే, మరోవైపు ఆయనకు సినీ మరియు రాజకీయ ప్రముఖుల నుండి మద్దతు పెరుగుతోంది. రాజకీయాల్లో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్న వేళ, విద్యార్థుల ఫలితాలపై ఆయన స్పందించడం.. సామాజిక అంశాలపై ఆయనకున్న నిబద్ధతను చాటుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో 'విజయ్ తదుపరి అడుగు ఏమిటి?' అనే ప్రశ్న అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.




