Heavy Rains: యూపీలో భారీ వర్షాలు.. వరదలో కొట్టుకుపోయిన 5 ఏనుగులు
Heavy Rains: ఉత్తర్ప్రదేశ్లో కుండపోత వర్షాలతో నదులు పొంగిపొర్లుతున్నాయి. బహ్రాయిచ్లో వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన 5 ఏనుగులను అటవీశాఖ అధికారులు చాకచక్యంగా రక్షించారు.
Heavy Rains: యూపీలో భారీ వర్షాలు.. వరదలో కొట్టుకుపోయిన 5 ఏనుగులు
Heavy Rains: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు ప్రమాదకర స్థాయిలో పొంగిపొర్లుతున్నాయి.
మంగళవారం ఉదయం బహ్రాయిచ్ జిల్లాలోని కౌడియాల నది ఉద్ధృతికి ఐదు ఏనుగులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. వీటిలో రెండు ఏనుగు పిల్లలు కూడా ఉన్నాయి. ఏనుగుల గుంపు గిర్జాపురి బ్యారేజ్ వైపు కొట్టుకుపోతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న కతర్నియాఘాట్ వన్యప్రాణి విభాగం అధికారులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. నీటిపారుదల శాఖ అధికారుల సమన్వయంతో బ్యారేజ్ గేట్లను మూసివేసి, నీటి ప్రవాహ తీవ్రతను తగ్గించారు. అనంతరం అటవీశాఖ సిబ్బంది ఐదు ఏనుగులను సురక్షితంగా బయటకు తీసి, అటవీ ప్రాంతానికి మళ్లించారు.
వాతావరణ శాఖ (IMD) సమాచారం ప్రకారం.. యూపీలోని మొత్తం 75 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అతి భారీ వర్షాలు: 7 జిల్లాలకు తీవ్ర హెచ్చరికలు.
భారీ వర్షాలు: 33 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆరెంజ్ అలర్ట్: 19 జిల్లాలకు వరద ముప్పు దృష్ట్యా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
మంగళవారం ఉదయం నుంచే రాజధాని లఖ్నవూతో పాటు వారణాసి, అయోధ్య, ఝాన్సీ సహా పలు ప్రధాన నగరాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.




