Vietnam Boat Accident : వియత్నాం బోటు ప్రమాదం.. భారత్కు మృతదేహాలు.!
Vietnam Boat Accident : వియత్నాంలో శనివారం జరిగిన ఘోర బోటు ప్రమాదంలో మరణించిన 15 మంది భారతీయ పర్యాటకుల మృతదేహాలు సోమవారం (నేడు) రాత్రికి..
vietnam boat accident
Vietnam Boat Accident : వియత్నాంలో శనివారం జరిగిన ఘోర బోటు ప్రమాదంలో మరణించిన 15 మంది భారతీయ పర్యాటకుల మృతదేహాలు సోమవారం (నేడు) రాత్రికి స్వదేశానికి చేరుకోనున్నాయి. ఈ విషాదకర ఘటన పర్యాటక రంగంలో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. మరోవైపు, ఈ ప్రమాదం నుండి తృటిలో ప్రాణాలతో బయటపడిన ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు పర్యాటకులు ఆదివారం రాత్రి సురక్షితంగా హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో వారు తమ కళ్ల ముందే జరిగిన భయానక ఉదంతాన్ని గుర్తుచేసుకుని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
ముంబయికి ప్రత్యేక విమానం ఏర్పాట్లు
వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. హోచి మిన్ సిటీ నుండి వియత్నాం ఎయిర్లైన్స్ (VN979) విమానంలో 15 మంది భారతీయుల మృతదేహాలను ముంబయికి తరలిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరే ఈ విమానం, భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 9:35 గంటలకు ముంబయిలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనుంది. ఈ విమాన ప్రయాణానికి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ను రాయబార కార్యాలయం వేగంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' వేదికగా అధికారికంగా వెల్లడించారు.
స్వస్థలాలకు తరలింపు.. రాష్ట్ర ప్రభుత్వాల అలర్ట్
ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారిలో అత్యధికులు దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారే కావడం గమనార్హం. మృతుల్లో 10 మంది తమిళనాడుకు చెందినవారు కాగా, ముగ్గురు ఆంధ్రప్రదేశ్ , ఇద్దరు కేరళ వాసులు ఉన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎంబసీ, ఈ క్లిష్ట సమయంలో వారికి అవసరమైన అన్ని సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది. మృతదేహాలు ముంబయి చేరుకున్న వెంటనే, అక్కడి నుండి వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు వీలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే సమాచారం అందించారు. బాధిత కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎయిర్పోర్ట్ వద్దే ప్రత్యేక ఏర్పాట్లు చేసి, నిరంతరం సమన్వయం చేసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
సముద్రంలో మునిగిపోయిన స్పీడ్బోట్
వియత్నాం స్థానిక పత్రిక 'విఎన్ ఎక్స్ప్రెస్' కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం అక్కడి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన ఫు క్వాక్ ద్వీపకల్పం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ‘ఓషన్ పెర్ల్ ఐలాండ్’ సంస్థకు చెందిన ఒక స్పీడ్బోట్ 36 మంది ప్రయాణికులతో ‘హాన్ మే రట్’ దీవి నుండి బయలుదేరి ‘అన్ థోయ్’ రేవుకు వస్తుండగా సముద్రంలో ఒక్కసారిగా మునిగిపోయింది. బోటు సముద్రపు అలల ధాటికి అదుపు తప్పిందా లేక సాంకేతిక లోపం వల్ల మునిగిపోయిందా అనే కోణంలో వియత్నాం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 15 మంది భారతీయులు నీట మునిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, మిగిలిన ప్రయాణికులను స్థానిక రెస్క్యూ టీమ్స్ , మత్స్యకారులు సకాలంలో స్పందించి కాపాడగలిగారు.




