Workplace Harassment : బాస్ వేధింపులు తాళలేక.. మహిళా ఉద్యోగి బలవన్మరణం.!

Workplace Harassment : కార్పొరేట్ , ప్రైవేట్ సంస్థల్లో పని ప్రదేశాలలో పెరిగిపోతున్న మానసిక వేధింపులు, ఒత్తిళ్లు మరో అమాయక ప్రాణాన్ని బలితీసుకున్నాయి.

G Krishna
Published on: 9 Aug 2026 1:55 PM IST
workplace-harassment
X

workplace-harassment

Workplace Harassment : కార్పొరేట్ , ప్రైవేట్ సంస్థల్లో పని ప్రదేశాలలో పెరిగిపోతున్న మానసిక వేధింపులు, ఒత్తిళ్లు మరో అమాయక ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కర్ణాటకలోని మైసూరుకు చెందిన 45 ఏళ్ల నాగేశ్వరి అనే మహిళ, తాను పనిచేస్తున్న సూపర్‌మార్కెట్ సూపర్‌వైజర్ వేధింపులు తాళలేక తన నివాసంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గడిచిన కొన్నేళ్లుగా సదరు సూపర్‌మార్కెట్‌లో నమ్మకంగా పనిచేస్తున్న నాగేశ్వరి, ఇటీవల కొత్తగా బాధ్యతలు చేపట్టిన డాలీ అనే సూపర్‌వైజర్ తనను తీవ్రంగా మానసిక వేధింపులకు గురిచేసిందని డెత్ నోట్‌లో పేర్కొంది. వారాంతపు సెలవులను కూడా ఇవ్వకుండా నిరాకరించడం, తాను చేయని తప్పులను బలవంతంగా రుద్దడం మాత్రమే కాకుండా, ఇటీవల అనారోగ్యం వల్ల రెండు మూడు రోజులు విధులకు హాజరుకాలేదనే ఏకైక కారణంతో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉద్యోగం నుంచి హఠాత్తుగా తొలగించారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం.. తీరా చూస్తే

శుక్రవారం మధ్యాహ్నం నాగేశ్వరి భర్త అశోక్ పనిమీద బయటకు వెళ్లిన సమయంలో ఈ విషాద సంఘటన జరిగింది. బయట ఉన్న అశోక్ తన భార్యకు వరుసగా ఫోన్ చేయగా, ఆమె ఎంతకీ కాల్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి కంగారుగా ఇంటికి చేరుకున్నాడు. తీరా లోపలికి వెళ్లి చూడగా నాగేశ్వరి స్పృహతప్పి నేలపై పడివుండటంతో హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు ఆసుపత్రికి తీసుకురాకముందే మృతి చెందినట్లు ధ్రువీకరించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ అన్యాయమైన ప్రవర్తన, ఉద్యోగం పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై తాను ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నట్లు నాగేశ్వరి లేఖలో రాసి పెట్టింది.

కేసు నమోదు.. దర్యాప్తు వేగవంతం

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, అక్కడే లభ్యమైన సూసైడ్ నోట్‌ను ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేశారు. ఒక మహిళను ప్రాణాలు తీసుకునేంతలా మానసిక వేధింపులకు గురిచేసిన సదరు సూపర్‌వైజర్‌పై , సూపర్‌మార్కెట్ యాజమాన్యం తీరుపై పోలీసులు సమగ్ర విచారణ ప్రారంభించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను రికార్డు చేయడంతో పాటు, ఆమె రాసిన లేఖలోని ఆరోపణల నిజానిజాలను నిర్ధారించుకుని చట్టపరమైన తదుపరి చర్యలు తీసుకుంటామని విచారణాధికారులు వెల్లడించారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story