Narrawada: నర్రవాడ వైభవంగా ముగిసిన వెంగమాంబ బ్రహ్మోత్సవాలు
Narrawada: నెల్లూరు జిల్లా నర్రవాడలో వెంగమాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆకర్షణగా నిలిచిన రాష్ట్రస్థాయి ఎద్దుల పోటీలు. విజేతలకు బహుమతుల ప్రదానం.
Narrawada: నర్రవాడ వైభవంగా ముగిసిన వెంగమాంబ బ్రహ్మోత్సవాలు
నర్రవాడ: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో గురవయ్య సమేత శ్రీ వెంగమాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల ఆఖరి ఘట్టంగా రాష్ట్రస్థాయి ఎద్దుల పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి మొత్తం 16 జతల ఎద్దులు ఈ పోటీల్లో పాల్గొని తమ సత్తా చాటాయి.
వేలాది మంది భక్తులు, రైతులు, పశుపోషకులు ఈ పోటీలను తిలకించేందుకు తరలివచ్చారు. సంప్రదాయ వ్యవసాయ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ ఎద్దుల పోటీలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పోటీల్లో పాల్గొన్న ఎద్దుల బలం, వేగం, యజమానుల నైపుణ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
పోటీల్లో మొదటి బహుమతిని బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెంకు చెందిన అత్తోటి శిరీష చౌదరి కైవసం చేసుకున్నారు. రెండో బహుమతిని విజయవాడ గన్నవరం ప్రాంతానికి చెందిన కౌసన్ననేని రాజా చౌదరి, వల్లభనేని మోహనరావు అందుకున్నారు. మూడో బహుమతిని సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన సుంకి సురేంద్ర రెడ్డి దక్కించుకున్నారు.
విజేతలకు ఆలయ కమిటీ సభ్యులు, బహుమతులు అందజేసి అభినందించారు. ఈ రాష్ట్రస్థాయి ఎద్దుల పోటీలతో ఐదు రోజుల పాటు ఘనంగా సాగిన గురవయ్య సమేత శ్రీ వెంగమాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి.




