Nellore: అంగరంగ వైభవంగా సాగిన బలరామకృష్ణుల రథయాత్ర
Nellore: నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో ఇస్కాన్ ప్రతినిధుల ఆధ్వర్యంలో శ్రీ బలరామకృష్ణుల రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది.
Nellore: అంగరంగ వైభవంగా సాగిన బలరామకృష్ణుల రథయాత్ర
Nellore: నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో బలరామకృష్ణుల రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. నెల్లూరు ఇస్కాన్ సిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవంలో, స్థానిక భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. స్థానిక సామిల్లు సమీపంలో, భక్తుల జయజయధ్వానాల మధ్య రథయాత్ర ప్రారంభమైంది.
అక్కడ నుండి బజారు వీధి, సిద్దలయ్య గుడి సెంటర్, కాపువీధి గుండా రథం ముందుకు సాగింది. మార్గమధ్యంలో రాపూరు ప్రజలు శ్రీ కృష్ణ, బలరాములకు కాయా కర్పూరాలు సమర్పించారు.. అనంతరం ఈ రథయాత్ర మద్దెల మడుగు వద్దనున్న శ్రీ రాధాకృష్ణ మందిరానికి చేరుకోవడంతో ఈ రధ యాత్ర ముగిసింది. రథయాత్ర సాగినంత పొడవునా భక్తుల హరినామ సంకీర్తనలు, భజనలు, కీర్తనలతో పురవీధులు మారుమోగాయి.
సాంప్రదాయ మంగళవాయిద్యాల నడుమ, దారి పొడువునా రంగవల్లులు, కళాకారుల కోలాటాలు, చక్క భజనలు, పండరి భజనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పురాణ పురుషుల ప్రత్యేక వేషధారణలు ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రధ యాత్ర ముగింపు సమయంలో, భక్తులందరికి 56 వంటకాల(చప్పన్ భోగ్) నివేదన అందచేశారు.ఈ కార్యక్రమంలో ఇస్కాన్ కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు వందలాది మంది భక్తులు పాల్గొని రథాన్ని లాగారు. ఆధ్యాత్మిక వాతావరణం లో ఈ రథయాత్ర విజయవంతం అయింది.




